
తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకుల కేరాఫ్ అడ్రస్లు మారిపోతున్నాయి. కొందరు నిర్మాతలకే వాళ్లు వరసగా సినిమాలు చేస్తున్నారు. వాళ్లు చేస్తున్నారనేకంటే.. అక్కడే వాళ్లను బయటికి పోనీకుండా లాక్ చేస్తున్నారు మన నిర్మాతలు. త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్.. వీళ్లంతా ఒకే నిర్మాణ సంస్థలో కొన్నేళ్లుగా వరస సినిమాలు చేస్తున్నారు.

త్రివిక్రమ్నే తీసుకోండి.. ఈయన సినిమా అనౌన్స్ చేసారంటే చాలు వెనక హారిక హాసిని క్రియేషన్స్ అని ఉండాల్సిందే. 2012లో వచ్చిన జులాయి నుంచి 2024లో వచ్చిన గుంటూరు కారం వరకు గురూజీ సినిమాలన్నీ ఈ నిర్మాణ సంస్థలోనే. బయటి నిర్మాతలకు త్రివిక్రమ్ అందుబాటులోనే లేరు.

తాజాగా శేఖర్ కమ్ముల సైతం ఏసియన్ సినిమాస్లో మూడో సినిమాకు కమిటయ్యారు. లవ్ స్టోరీతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLPలోకి ఎంట్రీ ఇచ్చారు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ధనుష్ సినిమాను కూడా అక్కడే తెరకెక్కిస్తున్నారు. దీని రెగ్యులర్ షూటింగ్ మొన్నే మొదలైంది.. అప్పుడే నెక్ట్స్ సినిమాను కూడా ఇదే నిర్మాణ సంస్థకు కమిటయ్యారు కమ్ముల.

సుకుమార్ సైతం 2018 నుంచి మైత్రి మూవీ మేకర్స్లోనే ఉండిపోయారు. రంగస్థలం తర్వాత పుష్ప వరల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు లెక్కల మాస్టారు.సందీప్ రెడ్డి వంగా సైతం టీ సిరీస్ భూషణ్ కుమార్తోనే కబీర్ సింగ్, యానిమల్ చేసారు. నెక్ట్స్ అనౌన్స్ చేసిన స్పిరిట్తో పాటు బన్నీ సినిమాను కూడా ఇదే బ్యానర్లో చేస్తున్నారు ఈ దర్శకుడు.

అలాగే దిల్ రాజు సంస్థలో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు వరస సినిమాలు చేస్తుంటారు. మొత్తానికి దర్శకులకు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇచ్చి బయటికి పోకుండా చూసుకుంటున్నారు నిర్మాతలు.