
మొత్తం 33 చిత్రాలను అధిగమించి మరాఠీ చిత్రం 'గోంధాల్' 99వ అకాడమీ అవార్డులు, అంటే 2027 ఆస్కార్స్కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. భారీ వాణిజ్య విజయాన్ని నమోదు చేసిన, వార్తల్లో నిలిచిన అనేక చిత్రాలను ఓడించి 'గోంధాల్' ఈ ప్రతిష్టాత్మక అవకాశాన్ని గెలుచుకుంది. ఈ విషయమై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. 'ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం' విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి 'గోంధాల్' ఎంపికైనందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది మరాఠీ చిత్ర పరిశ్రమకు కూడా గర్వకారణంగా భావిస్తున్నారు. 'గోంధాల్' ఆస్కార్ గెలవడంతో, మరాఠీ సినిమా పేరు మరోసారి అంతర్జాతీయ వేదికకు చేరింది.సంతోష్ దావ్ఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిషోర్ కదమ్, ఇషితా దేశ్ముఖ్, యోగేష్ సోహోని, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు, సురేష్ విశ్వకర్మ, మాధవి జువేకర్, ఐశ్వర్య షిండే, కైలాష్ వాఘ్మారే, ప్రభాకర్ మఠపతి, విఠల్ కాలే, ప్రవీణ్ దాలింబ్కర్, శరద్ జాదవ్, పూనమ్ పాటిల్ , ప్రశాంత్ దేశ్పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆస్కార్కు నామినేట్ అయిందన్న వార్త బయటకు రావడంతో నటీనటులందరిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

గ్రామీణ మహారాష్ట్ర నేపథ్యంలో సాగే ఈ కథలో సుమన్ అనే వివాహిత కేంద్రబిందువు. ఆనంద్ అనే ధనవంతుడితో ఇష్టం లేని పెళ్లి జరగడంతో ఆమె తన దాంపత్య జీవితంలో అసంతృప్తిగా జీవిస్తుంటుంది. అదే సమయంలో 'గోంధాలి' కళాకారుడైన సాహెబా అనే వ్యక్తితో ఆమె ప్రేమలోపడుతుంది. ఈ క్రమంలో తన భర్త నుంచి బయటపడి ప్రేమికుడితో వెళ్లిపోవాలని పథకం వేస్తుంది. అయితే, వీరి ప్లాన్లోకి ఆనంద్ బావమరిది అయిన సర్జేరావు ప్రవేశించడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

ఒక్క రాత్రిలో జరిగే 'గోంధాల్' పూజ వేడుకల వెనుక కామం, అసూయ, నమ్మకద్రోహం, హత్య కుట్రలు ఎలా చోటుచేసుకున్నాయనేది ఈ చిత్ర ప్రధానాంశం. అనుమానాలు, రహస్యాల నడుమ ప్రతి పాత్ర తన ఉనికి కోసం, స్వార్థం కోసం చేసే పోరాటం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు ఇళయరాజా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. సంస్కృతిని, సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ని దర్శకుడు సమర్థవంతంగా మేళవించిన తీరు పట్ల ఆస్కార్ ఎంపిక కమిటీ చైర్మన్ పి. శేషాద్రి నేతృత్వంలోని 14 మంది సభ్యుల జ్యూరీ ప్రశంసలు కురిపించింది.

జల్నాకు చెందిన కైలాస్, 'శివాజీ అండర్గ్రౌండ్ ఇన్ భీమ్నగర్ మొహల్లా' అనే నాటకంలో తన సొంత యాసలో ఒక పాత్ర పోషించారు. ఈ నాటకానికి ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన ఆయనకు చాలా ముఖ్యమైనది. ఈ విజయం ఆయన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది, ఆ తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. దీని గురించి మాట్లాడుతూ, కైలాస్ తన భాష గురించి ఒక ముఖ్యమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రామాణిక భాష, గ్రామీణ భాషల మధ్య తేడా చూపడాన్ని, ఒకటి మంచిది, మరొకటి చెడ్డది అని చెప్పడాన్ని ఆయన వ్యతిరేకిస్తారు. తన గ్రామ భాష అక్కడి ప్రజలకు సమానంగా స్వచ్ఛమైనదని, అదేవిధంగా ముంబైలో మాట్లాడే భాష ముంబైకి చెందిన స్వచ్ఛమైన భాష అని ఆయన అభిప్రాయపడ్డారు.