
సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్తో పాటు.. జేఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని అటు ఘట్టమనేని ఫ్యామిలీ.. ఇటు అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇంట్లో వరుస విషాదాలతో మహేష్ పూర్తిగా కుంగిపోయారు. ఏడాది ప్రారంభంలోనే అన్నయ్యను.. రెండు నెలల క్రితం తల్లి ఇందిరా దేవిని.. ఇప్పుడు తండ్రి కృష్ణను కోల్పోవడంతో మహేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో గొప్పది.. మీ అభిమానం.. అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లోనూ ఉంటారని మహేష్ ఉద్వేగంగా మాట్లాడారు. ఈ సమయంలో అభిమానులు కంటతడి పెట్టుకున్నారు.

ఎన్ కన్వెన్షన్కు వెళ్లి అక్కడికి వచ్చిన ప్రముఖులను కూడా మహేష్ బాబు పలకరించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో మహేష్ బాబు సరదాగా ముచ్చటిస్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేష్ బాబుతో పాటు దర్శకులు త్రివిక్రమ్, మెహర్ రమేష్, నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కూడా ఉన్నారు.

అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారని భావించిన మహేష్.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పాస్ సిస్టమ్ పెట్టారు. ఫ్యాన్స్కు పాస్లు ఇచ్చారు. పాస్లు ఉన్నవారిని మాత్రమే జేఆర్సీ కన్వెన్షన్లోకి అనుమతించారు. అభిమానుల కోసం 32 రకాల వంటకాలను మహేష్ బాబు సిద్ధం చేయించారు.

ఇంటి వద్ద పెద్ద కర్మకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తికాగానే మహేష్ బాబు.. అభిమానులను పలకరించేందుకు బాబాయ్ ఆదిశేషగిరిరావుతో కలిసి జేఆర్సీ కన్వెన్షన్కు వెళ్లారు. అక్కడ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

కృష్ణ అంత్యక్రియలను 16వ తేదీన జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉన్న మహేష్బాబు.. ఆదివారం తండ్రి దశదిన కర్మలో అభిమానులనుద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు.