
రష్మిక అప్పుడెప్పుడో అన్న మాట ఇప్పుడు మళ్లీ కొత్తగా వైరల్ అవుతోంది. కాకపోతే ఈ సారి నేషనల్ క్రష్ గురించి మాత్రమే కాదు, ఆమెలాగా ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్లు అందరి మీదా ఫ్లడ్ లైట్స్ పడుతున్నాయి.

రష్మిక అన్న మాటలకు పూజా, కృతిశెట్టి, శ్రీలీలకు సంబంధం ఏంటి? యానిమల్ సినిమా సక్సెస్ అయ్యాక రష్మిక మందన్న రెమ్యునరేషన్ ఉన్నట్టుండి నాలుగు, నాలుగున్నర కోట్లకు పెరిగింది.. ఇదీ ఆ మధ్య వైరల్ అయిన వార్త. దాన్ని షేర్ చేసిన రష్మిక.

బాబోయ్... ఇప్పుడు నేను ఇంత తీసుకోవాలా? ఒకవేళ ప్రొడ్యూసర్స్ ఇవ్వకపోతే, నా ఫ్యాన్స్ నా మార్కెట్ ఇంత అని అనుకుంటున్నారు.. మీరే చూడండి అని వారికి ఇవన్నీ చూపించాలా? అంటూ సరదాగా స్పందించారు.

సినిమా సక్సెస్ అయ్యీ కాగానే రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారనే మాటకు ఇప్పుడు రష్మిక విషయంలో అయితే క్లారిటీ దొరికింది. కానీ, అసలు ఇలాంటి విషయాల్లో గప్చుప్మనకుండా ఉంటారు హీరోయిన్లు.

ఆ మధ్య నాన్స్టాప్గా సినిమాలకు సంతకం చేసిన శ్రీలీల విషయంలోనూ ఇలాంటి టాకే వినిపించింది. అంతెందుకు.. ఫస్ట్ మూవీ ఉప్పెనతో వంద కోట్ల క్లబ్లోకి చేరిన హీరోయిన్ కృతి శెట్టి, మరీ ఫస్ట్ మూవీకే రెమ్యునరేషన్ పెంచేశారనే వార్తలు అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే కాన్సెప్ట్ తో , హీరోయిన్ల మేనేజర్లు చుక్కల్నంటే రెమ్యునరేషన్లు డిమాండ్ చేస్తారన్నది మార్కెట్లో పదే పదే వినిపించే మాటే. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలొస్తే, పారితోషికాలు సినిమా సినిమాకీ పెరుగుతాయని అంటారు.

ఆ మధ్య పూజా హెగ్డే కూడా అలాగే పెంచేశారనే టాక్ వినిపించింది. అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు... సినిమాలకు గ్యాప్ వచ్చినా, చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా... రెమ్యునరేషన్లు తిరోగమనంలో పడతాయన్న ఫ్యాక్ట్ కూడా తెలుసుకోవాలి ఈ బ్యూటీలు అని అంటున్నారు క్రిటిక్స్.