
గతంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నాడు నిర్మాత బండ్ల గణేశ్. ఇప్పుడు ఆ మొక్కుని నెరవేర్చుకునేందుకు సంకల్పయాత్రను ప్రారంభించాడు.

సుమారు 20 రోజుల క్రితం షాద్ నగర్ లో ప్రారంభమైన ఈ సంకల్ప యాత్ర ఇప్పటికే అలిపిరికి చేరుకుంది. కాగా ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు.

తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ బండ్లన్న సంకల్ప యాత్రలో పాల్గొన్నరు. బండ్ల గణేశ్ తో కలిసి కొద్ది దూరం నడిచాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బండ్ల గణేశ్.

'నా సంకల్పయాత్రలో ఈ రోజు నాతో అడుగులు వేసిన తమ్ముడు విశ్వక్ సేన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అని ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

కాగా ఫంకీ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాడు విశ్వక్ సేన్. ఇందులో భాగంగానే బండ్లగణేశ్ పాదయాత్రలో పాల్గొన్నాడు.