
పడటం.. లేవడం.. పరిగెత్తడం బాగా తెలిసిన దర్శకుడు పూరీ జగన్నాథ్. కాకపోతే ఈ సారి ఇంకాస్త గట్టిగా పడ్డారీయన. మరి ఇంతకుముందులా లేచి నిలబడతారా.. పరిగెత్తడం పక్కనబెట్టి ముందు నడవగలరా..?

లైగర్ కొట్టిన దెబ్బ నుంచి పూరీ కోలుకుంటారా..? డబుల్ ఇస్మార్ట్తో ఈయన మ్యాజిక్ పని చేస్తుందా లేదా..? అసలు ఈ చిత్ర షూటింగ్ ఎంతవరకు వచ్చింది..?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులైనా ఉండొచ్చు కానీ పూరీ జగన్నాథ్ మాత్రం సమ్థింగ్ స్పెషల్. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే రచ్చ రచ్చే.. కానీ ఆ మ్యాజిక్ ఇప్పుడు కనిపించడం లేదు.

కొన్నేళ్లుగా పూరీ నుంచే వచ్చే సినిమాల్లో కంటెంట్ మిస్ అవుతుంది.. లైగర్ అయితే పాన్ ఇండియన్ స్థాయిలో బెడిసికొట్టింది. దాంతో పూరీ మార్క్పై ఎఫెక్ట్ బాగానే పడింది.

టెంపర్ తర్వాత సరైన హిట్ లేని ఈయన.. ఇస్మార్ట్ శంకర్తో సాలిడ్ బ్లాక్బస్టర్ కొట్టారు. అదే జోరు విజయ్ దేవరకొండతో లైగర్ చేసి ఇండియాను షేక్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. లైగర్ దెబ్బతో ఏడాదికి పైగానే ఖాళీగా ఉన్నారీయన.

ఈ మధ్యే రామ్తో డబుల్ ఇస్మార్ట్ మొదలు పెట్టారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.. ఇస్మార్ట్ శంకర్కు ఇది సీక్వెల్ కావడంతో ఆసక్తి పెరిగిపోయింది.

రామ్ కంటే పూరీ జగన్నాథ్ కెరీర్కు డబుల్ ఇస్మార్ట్ కీలకంగా మారింది. లైగర్ ఎఫెక్ట్ పోవాలంటే కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టి తీరాల్సిందే.. పూరీ ముందు మరో ఆప్షన్ కూడా లేదు.

పాన్ ఇండియా దృష్టిలో పెట్టుకుని సంజయ్ దత్ లాంటి వాళ్లను ఇందులో కాస్ట్ చేసారు ఈ డేరింగ్ డైరెక్టర్. మార్చ్ 8, 2024న డబుల్ ఇస్మార్ట్ విడుదల కానుంది. చూడాలిక.. పూరీ ఏం చేస్తారో..?