అమీర్ ఖాన్ తాజా సినిమా లాల్ సింగ్ చద్దా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మిస్టర్ పర్ఫెక్ట్ హైదరాబాద్ చేరుకున్నారు
అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్ధా సహానటుడు, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్ లను మనం చూసాం కానీ.. అయితే మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్ ఇప్పుడే చూస్తున్నాం.. ఇటువంటి అద్భుతమైన ఛాలెంజ్ ను మనకు అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరు భాగస్వాములై మొక్కలు నాటాలని దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని అమీర్ ఖాన్ పిలుపునిచ్చారు.
అంతేకాదు మనందరం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని.. అందుకు తప్పనిసరిగా మొక్కలు నాటాలని.. వాటిని బాధ్యతగా పెంచాలని అమీర్ ఖాన్ చెప్పారు. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతాం. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నానని అన్నారు మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్
ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో అమీర్ ఖాన్, నాగ చైతన్య, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో పాటు రామ్మోహన్ రావు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.