
తెలుగు సినిమా ప్రియులకు సుపరిచితమైన పేరు పునర్నవి భూపాలం. రాజ్ తరుణ్, అవికా గోర్ కలిసి నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే అందం, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిల కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో మెరిసింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ భామ.. బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగులో పాల్గొని మంచి ఫేమ్ సంపాదించుకుంది. సినిమాల కంటే ఎక్కువగా ఈ షో ద్వారానే పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. అయితే ఈ షో తర్వాత ఆమెకు అవకాశాలు క్యూ కట్టినట్లు సమాచారం.

కానీ ఆఫర్స్ వదులుకుని లండన్ లో పై చదువులు చదుకుంది. పూర్తిగా సినిమాలకు దూరమై మొత్తం చదువుపై దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పునర్నవి అప్పుడప్పుడు ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేసింది. ఇటీవల డిసెంబర్ లో తను ప్రేమించిన అబ్బాయిని నిశ్చితార్థం చేసుకున్నా అంటూ ప్రకటించింది. దీంతో ఆమెకు ఫ్యాన్స్, ప్రముఖులు విషెస్ తెలియజేశారు.

తాజాగా పునర్నవి తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. నిన్న రాత్రి మార్చి 20న వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పునర్నవి భర్త పేరు హేమంత్ వర్మ. అతడు పాపులర్ ఫోటోగ్రాఫర్. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ జంటకు నెటిజన్లు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పునర్నవి భూపాలం చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న పునర్నవి.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే సింగర్ రాహుల్ సింప్లిగంజ్ సైతం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.