
హిందీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన శోభితది తెలుగు అమ్మాయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మూలాలున్న శోభిత, విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ప్రారంభించింది.

2013లో 'ఫెమినా మిస్ ఇండియా ఎర్త్' కిరీటాన్ని గెల్చుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది శోభిత. ఆ తర్వాత బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో మంచి నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో అడివి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది శోభిత. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించి మెప్పించిందీ అందాల తార.

ఇదే క్రమంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది శోభిత. చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట రెండేళ్ల క్రితం ఒక్కటయ్యారు. 2024 డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో నాగ చైతన్య- శోభితల వివాహం అత్యంత వైభవంగా జరిగింది

కాగా పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసిన శోభిత సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా శోభిత చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను చాటిచెబుతూ ప్రత్యేక ఫోటోషూట్ లో పాల్గొంది. తెలంగాణకే తలమానికమైన 'గద్వాల్ చీర'ను ధరించి రాయల్ లుక్లో మెరిసిపోయింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన శోభిత..'మనం చేనేత వస్త్రాల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి నేరుగా ఆ నేత కార్మికులకే వెళ్తుంది, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం శోభిత ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.