
ప్రముఖ నటి మధుబాల గతంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన అంశాలను పంచుకున్నారు. ఆమె తన స్నేహితుల గురించి, ముఖ్యంగా నటి రమ్యకృష్ణతో ఆమెకున్న గాఢమైన బంధం గురించి వివరించారు. ఈ ఇంటర్వ్యూలో ఆరోగ్యం, వెల్నెస్ పట్ల ఆమెకున్న శ్రద్ధ కూడా స్పష్టంగా తెలిపారు. మధుబాల పరిశ్రమలో తన బెస్ట్ ఫ్రెండ్గా రమ్యకృష్ణను పేర్కొన్నారు. తమ పాఠశాల రోజుల నుండి కూడా తనకు సన్నిహిత స్నేహితులు ఉన్నారని ఆమె తెలిపారు.

సినీ పరిశ్రమలో ఖుష్బూ, రాధిక, బృందా డ్యాన్స్ మాస్టర్, అను డిజైనర్ వంటి వారితో కూడా తనకు మంచి అనుబంధం ఉందని, ఈ స్నేహితులు తన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని మధుబాల అన్నారు. జీవితంలో పసిపిల్లలా మారడానికి, విషయాలను పంచుకోవడానికి స్నేహితులు చాలా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. రమ్యకృష్ణతో ఆమెకున్న స్నేహాన్ని వివరిస్తూ, తమ బంధం కాలక్రమేణా ఎలా పరిణామం చెందిందో మధుబాల తెలియజేశారు.

"మేము 20 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు, నవ్వుతూ, పార్టీలు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మాకు 50 ఏళ్లు, మేము ఎక్కువగా మాట్లాడుకుంటాం" అని ఆమె చెప్పారు. పార్టీలు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, వారి సంభాషణలు ఇప్పుడు మరింత లోతైన విషయాలపై ఉంటాయని మధుబాల వెల్లడించారు. ముఖ్యంగా, వెల్ బీయింగ్, హోలిస్టిక్ హెల్త్ వారి చర్చలలో ప్రధానాంశాలుగా మారాయి. ఆరోగ్య విషయాలపై రమ్యకృష్ణతో తరచుగా చర్చించుకుంటానని మధుబాల తెలిపారు.

రమ్యకృష్ణ అద్భుతమైన ప్రదేశాలకు వెళుతుందని, తను కూడా విభిన్నమైన పనులు చేస్తుంటానని చెప్పారు. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యమని ఇద్దరూ నమ్ముతారని, ఒకరికొకరు ఆరోగ్య చిట్కాలను పంచుకుంటారని మధుబాల అన్నారు. ఉదాహరణకు, మధుబాల ఎక్కువగా కాఫీ తాగడాన్ని రమ్యకృష్ణ ఇష్టపడదని, ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతూ, ఎందుకు ఇంత కాఫీ తాగుతున్నావు?" అని అడుగుతుందని తెలిపారు.

తన రోజువారీ దినచర్య గురించి మధుబాల వివరిస్తూ, తాను చాలా ఉదయాన్నే లేచి యోగా చేస్తానని చెప్పారు. హైడ్రేషన్ ఎంత ముఖ్యమో తెలుపుతూ.., పుష్కలంగా నీరు తాగుతానని తెలిపారు. నేటి ఆధునిక ఆహారపు అలవాట్లు, పిజ్జాలు, కాఫీలు వంటి వాటి వల్ల వచ్చే యాసిడిటీ, ఇతర సమస్యలను తగ్గించడానికి హైడ్రేషన్ చాలా ముఖ్యమని మధుబాల పేర్కొన్నారు. శరీరానికి సరైన శ్రద్ధ తీసుకోవడం ద్వారా సగం సమస్యలు పరిష్కారమవుతాయని ఆమె అన్నారు.