
ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహా సభలు గుంటూరులోని సత్యసాయి స్పిరుచ్యువల్ సెంటర్లో జరగనున్నాయి. పెద్ద ఎత్తున వీఐపీలు తరలి రానున్నారు. వివిధ విభాగాల్లో లబ్ధప్రతిష్టులైన అనేక మంది వచ్చే ఈ సభల్లో వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వీఐపీల విడిది దగ్గర నుంచి వెళ్లేంత వరకూ వారికి అవసరమైన మౌళిక సదుపాయాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన క్యాప్సూల్ ఆకట్టుకుంటుంది. క్యాప్సూల్ హోమ్గా చెప్పుకునే వీటిని ఒక్కొక్కటి 23 లక్షల రూపాయల ఖరీదు అవుతోంది. మొత్తం మూడు క్యాప్సూల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాప్సూల్లలో ఇంటిలో ఉండే అన్ని వసతులుంటాయి.

16 పడకలతో ఉండి ప్రత్యేకంగా ఉంటుంది. వీఐపీలు రెస్ట్ తీసుకునేందుకు ఈ పడక గది ఉపయోగపడుతుంది. ఇక 16 పడకలతో పాటు వంటగది అధునాతన టాయిలెట్స్, షవర్స్తో పాటు బాల్కనీ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమైన వ్యక్తులు ఈ క్యాప్సూల్ హోమ్స్లోనే బస చేయనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రపంచ తెలుగు మహా సభలను ప్రారంభించనున్నారు.

అదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా మహాసభల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటువంటి ముఖ్యమైన వారికి ఈ క్యాప్సూల్ హోమ్స్ను కేటాయించనున్నారు. మూడు రోజుల పదుల సంఖ్యలో వచ్చే విఐపిలు సభల్లో పాల్గొన్న అనంతరం ఈ క్యాప్సూల్స్కు వెళ్లి స్టే చేయవచ్చు.

తిరిగి సభల్లో తమ వంతు వచ్చినప్పుడు పాల్గొనవచ్చు. రహదారులపై ట్రాఫిక్ తగ్గించడం, వీఐపీ మూవ్ మెంట్తో స్థానికలకు ఇబ్బంది లేకుండా చూడాలన్న ఉద్దేశంతో సభా ప్రాంగణంలో ఈ క్యాప్సూల్ హోమ్స్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహాకులు గజల్ శ్రీనివాస్, రామచంద్రరాజు తెలిపారు. ఏదీ ఏమైనా సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఉన్న క్యాప్సూల్ హోమ్స్ను చూసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.