
ఎండలు మండిపోతున్నప్పుడు శరీరం తేమను కోల్పోయి త్వరగా అలసిపోతుంది. ఈ సమయంలో చాలామంది మార్కెట్లో దొరికే కూల్డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కానీ ఈ కృత్రిమ పానియాలతో పోల్చుకుంటే ప్రకృతి సిద్ధంగా లభించే పానీయాలే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మజ్జిగ, లస్సీని తాగడం ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే రెండింటిలో ఏది తాగడం మంచిదని చాలా మందిలో కొన్ని ప్రశ్నలు ఉండిపోయాయి. వాటికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండల తీవ్రత వల్ల చెమట ద్వారా శరీరం నుండి లవణాలు, నీరు బయటకు వెళ్లిపోతాయి. అందుకే కేవలం దాహం తీరడమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే, కడుపును చల్లబరిచే పానీయాలు ఈ కాలంలో చాలా అవసరం. ఈ విషయంలో లస్సీ, మజ్జిగ రెండు అద్భుతంగా పనిచేస్తాయి.

లస్సీ ప్రయోజనాలు: సాధారణంగా లస్సీని పెరుగుతోనే తయారు చేస్తారు. పెరుగును చిలికి అందులో పంచదార లేదా ఉప్పు కలిపి లస్సీని తయారు చేస్తారు. ఇందులో కాల్షియం, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది తాగగానే తక్షణ శక్తి లభిస్తుంది. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అయితే ఇందులో కేలరీలు, పంచదార అధికంగా వాడటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిన తక్కువ మోతాదులో కలుపుకోవడం ఉత్తమం

మజ్జిగ: మజ్జిగను కూడా పెరుగుతోనే తయారు చేస్తున్నారు. పెరుగుకు ఎక్కువ నీటిని కలిపి పలచగా చేసే మజ్జిగ వేసవిలో బాడీని కూల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కవ్వంతో చిలికిన మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇందులో కేలరీలు తక్కువ, కాబట్టి రోజుకు ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. ఇది శరీరాన్ని లోపల నుండి చల్లబరుస్తుంది.

రెండింటిలో ఏది బెస్ట్: వేసవి కాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మజ్జిగ అత్యంత ఉత్తమమైన ఎంపిక. ఇది శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తూనే తేలికగా ఉంటుంది. అయితే మీకు తీపిగా రుచి కావాలి అనుకున్నప్పుడు రుచి కోసం లస్సీ తాగొచ్చు, కానీ అందులో చక్కెర తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన తాజా పానీయాలకే ప్రాధాన్యత ఇవ్వండి.(Note : పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన మేరకు మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించడం లేదు. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)