
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి వారి అకౌంట్లోని బ్యాలెన్స్పై ఈపీఎఫ్ఓ ప్రతీ ఏడాది వార్షిక వడ్డీని అందిస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రతీ ఆర్ధిక సంవత్సరం చివరిలో వడ్డీని నిర్ణయిస్తూ ఉంటారు. గత మూడేళ్లుగా వడ్డీని స్ధిరంగా 8.25 శాతం వద్ద ఉంచుతోంది. 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని జులై 15వ తేదీలోపు అర్హులైన వారందరికీ ఈపీఎఫ్ఓ అందించింది. ఇప్పటికే ఇవి ఖాతాదారుల అకౌంట్లలో జమ అయ్యాయి. ఈ సారి ముందే అకౌంట్లలో పడటంలో ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొన్ని సమయాల్లో మీకు అర్హత ఉన్నా పీఎఫ్ వడ్డీ జమా కాకపోవచ్చు. మూడేళ్ల పాటు మీరు అకౌంట్ను ఉపయోగించకపోతే ఆటోమేటిక్గా సిస్టమ్ ఇనాక్టివ్ చేస్తుంది. అకౌంట్ నుంచి ఎలాంటి క్లెయిమ్స్ చేయకపోయినా, కేవైసీ లాంటివి అప్డేట్ చేయకపోయినా, ఏం చేయకుండా అలాగే ఏళ్ల పాటు వదిలేస్తే అకౌంట్ ఇనాక్టివ్గా మారుతుంది. ఇలాంటి సమయంలో మీరు పీఎఫ్ వడ్డీని అందుకోలేరు. దీంతో అకౌంట్ను ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం.

ఇక మీరు 55 సంవత్సరాలు నిండకముందే పదవీ విరమణ చేస్తే 58 ఏళ్లు వచ్చే వరకు వడ్డీ జమ అవుతుంది. ఆ తర్వాత నుంచి జమ అవ్వదు. ఇక శాశ్వతంగా దేశం విడిచి వెళ్లడం, సభ్యుడి మరణించిన సమయంలో ఎవరూ డబ్బులు క్లెయిమ్ చేయకపోవడం వంటి కారణాలతో మూడేళ్ల తర్వాత అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఇలాంటి సమయంలో కూడా వడ్డీ జమ అవ్వదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 58 ఏళ్లు వచ్చే వరకు యాక్టివ్ ఖాతాలకు వడ్డీ జమ చేస్తారు.

ఈపీఎఫ్ఓ వడ్డీ లెక్కింపు విషయానికొస్తే.. నెలవారీగా మీ అకౌంట్లో నిల్వ ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. ప్రతీ నెలా అందుబాటులో ఉన్న బ్యాలెన్స్పై వడ్డీ లెక్కిస్తారు. ఆర్ధిక సంవత్సరం చివరిలో వీటిని ఒకేసారి జమ చేస్తారు. మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ అయిన దగ్గర నుంచే మీరు వడ్డీని సంపాదించడం ప్రారంభిస్తారు. ఒకవేళ మీరు మనీ విత్ డ్రా చేసుకుంటే.. మిగిలిన బ్యాలెన్స్పై మాత్రమే వడ్డీ చెల్లిస్తారు. విత్ డ్రా చేసుకున్న సొమ్ముపై వడ్డీ అందదు.

ఒకవేళ వార్షిక క్రెడిట్ ఎంట్రీ పాస్బుక్లో ఆలస్యంగా కనిపించినంత మాత్రాన సభ్యులు వడ్డీని కోల్పోరు. సంవత్సరం పొడవునా ఎలాంటి విత్ డ్రాలు చేసుకోకుండా నెలవారీ చెల్లింపులు కొనసాగితే క్రమంగా పెరుగుతున్న నిల్వపై ప్రతి నెలా వడ్డీని లెక్కిస్తారు. సంవత్సరాంతంలో ఈ వడ్డీని EPF ఖాతాలో జమ చేస్తారు. దీంతో వడ్డీ ఆలస్యంగా జమ అయినా మీకు నష్టం జరగదు.