
పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు, ప్రపంచవ్యా్ప్తంగా అనిశ్చితి నెలకొన్న క్రమంలో దేశంలో వంటగ్యాస్ కొరత గత కొంతకాలంగా నెలకొంది. గ్యాస్ దొరక్క రెస్టారెంట్లు, హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ఆహార ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్యాస్ కొరత నుంచి బయటపడేందుకు కేంద్రం అనేక ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG)పై దృష్టి పెట్టింది

ప్రజలందరూ పీఎన్జీ వైపు మళ్లాలని, ఈ కనెక్షన్లు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ క్రమంలో మహానగర్ గ్యాస్ కీలక ప్రకటన చేసింది. పీఎన్జీ కనెక్షన్లు ఎక్కువమంది తీసుకునేలా ప్రోత్సహించడంలో భాగంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా పీఎన్జీ కనెక్షన్ తీసుకుంటే రూ.500 గ్యాస్ ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజును కూడా మాఫీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

మార్చి 16 నుంచి ఏప్రిల్ 30 మధ్య పీఎన్జీ కనెక్షన్ కొత్తగా తీసుకునేవారికి రూ.500 విలువైన గ్యాస్ లభిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అశు సింఘాల్ ప్రకటించారు. ఇక 60 శాతానికిపైగా పీఎన్జీ కనెక్షన్ కవరేజ్ ఉన్న భవనాల్లో ఉండేవారికి అదనంగా గ్యాస్ బిల్లుపై రూ.వెయ్యి తగ్గింపు ఇస్తామని తెలిపారు. తమ కంపెనీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం గ్యా్స్ సరఫరా చేస్తుందన్నారు.

ఆన్లైన్లో గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ కస్టమర్కు రూ.500 ఇన్స్టంట్ డిస్కౌంట్ వస్తుందని కంపెనీ ప్రతినిధులు తెతిపారు. ఇక గ్యాస్ ఉపయోగించకపోతే కనీస ఛార్జి మాఫీ చేస్తామని చెప్పారు. అలాగే కనెక్షన్ యాక్టివ్ అయినప్పుడు మాత్రమే చెల్లించే విధంగా త్వరలో జీరో అప్ ఫ్రంట్ రిజిస్ట్రేష్ ఫీజు విధానం ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

అటు వాణిజ్య వినియోగదారులకు రిజిస్ట్రేషన్ ఫీజులను మాఫీ చేస్తామని కంపెనీ తెలిపింది. గ్యాస్ సరఫరా అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అన్ని ప్రాంతాల్లో విశ్వసనీయమైన గ్యాస్ సరఫరా, మెరుగైన సేవలను అందిస్తామని స్పష్టం చేసింది.