
పెట్రోల్, డీజిల్ ధరలపై మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వీటి ధరలు పెరిగే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీని వల్ల పెట్రోల్ ధరలను కేంద్రం పెంచడం లేదని, ఎన్నికల ఫలితాలు వచ్చాక పెంపు ఉండే అవకాశముందని అంటున్నారు

అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్కు 120 డాలర్లకుపైగా పెరగడంతో ఇంధన కంపెనీలపై భారం పడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో బ్యారెల్ 70 డాలర్లకుపైగా ఉండగా.. ఇప్పుడు భారీగా పెరిగాయి. భారత్ ముడి చమురులో 88 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల ముడి చమురు ధరలు ఆమాంతం పెరిగాయి.

అయినా సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెంచలేదు. ఎన్నికల వేళ ధరలను స్ధిరంగా ఉంచినట్లు చెబుతున్నారు. దీని వల్ల ప్రముఖ రంగ చమురు కంపెనీలకు నష్టం జరుగుతోంది. ముడి చమురు ధరలు పెరిగినా.. ధరలను పెంచకపోవడం వల్ల లీటర్ పెట్రోల్పై రూ.18, డీజిల్పై రూ.35 వరకు కంపెనీలు నష్టపోతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రోజుకు రూ.2,400 కోట్లు నష్టపోయాయి.

అయితే కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు నష్టాలు తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్పై ఎక్సైంజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్పై లీటర్కు రూ.10 తగ్గించగా.. డీజిల్పై సున్నాకు తగ్గించింది. దీని ద్వారా కంపెనీలకు నష్టాలు రూ.1600 కోట్లకు తగ్గాయి. ఏప్రిల్లో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు ఖచ్చితంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

ఎక్సైంజ్ సుంకం తగ్గించినా వాటి ప్రయోజనాలను కస్టమర్లకు కంపెనీలు బదిలీ చేయలేదు. తమ నష్టాలను పాక్షికంగా తగ్గించుకోవడానికి ఉపయోగించాయి. మార్చిలో కంపెనీలు భారీగా నష్టపోయాయి. జనవరి, ఫిబ్రవరి నెలలలో వచ్చిన లాభాలన్నీ తుడుచుకుపెట్టుకుపోయాయి. దీంతో ధరలను పెంచక తప్పని పరిస్థితి ఎదురైంది.