గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు దేశంలోని మూడు ప్రభుత్వ సంస్థలైన హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ గుడ్ న్యూస్ అందించాయి. ఇకపై వినియోగదారులు ఏ ఏజెన్సీ నుంచైనా ఎల్పిజి రీఫిల్ పొందవచ్చు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ సౌకర్యం ప్రస్తుతం గుర్గావ్, పూణే, రాంచీ, చండీఘర్, కోయంబత్తూర్లలో అందుబాటులో ఉంది.
కస్టమర్లు తమ మొబైల్ యాప్ లేదా పోర్టల్ ద్వారా ఎల్పీజీ రీఫిల్ను బుక్ చేసేటప్పుడు, వారికి దగ్గరలోని డిస్ట్రిబ్యూటర్ల లిస్టును చూడవచ్చు. ఆ జాబితా నుంచి పంపిణీదారులలో ఎవరినైనా కూడా ఎంచుకోవచ్చు. ఈ సేవ పంపిణీదారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని తీసుకురావడమే కాకుండా.. పెర్ఫార్మన్స్ రేటింగ్స్ను కూడా పెంచుకోవడంలో దోహదపడుతుంది.
చమురు కంపెనీలు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్ను ఆన్లైన్లో బదిలీ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ లాగిన్ను ఉపయోగించి తమ ప్రాంతంలోని పంపిణీదారుల జాబితా నుండి OMC పంపిణీదారుని ఎంచుకోవచ్చు.
తద్వారా తమ ఎల్పీజీ కనెక్షన్ను పోర్ట్ చేసే ఆప్షన్ను కస్టమర్లకు ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ సదుపాయం పూర్తిగా ఉచితం. ఎలాంటి ఛార్జీలు పడవు. మే 2021 నాటికి, 55,759 పోర్టబిలిటీ అభ్యర్థనలు OMCలు విజయవంతంగా నెరవేర్చారు.