
అత్యవసరంగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకునే సమయంలో తత్కా్ల్ టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. సాధారణ టికెట్లతో పోలిస్తే వీటి ఛార్జీలు కాస్త అధికంగా ఉంటాయి. ఈ టికెట్లు చాలా తక్కువగానే అందుబాటులో ఉంటాయి. దీంతో రిలీజ్ చేసిన కొద్దిసేపటికే బుకింగ్స్ అయిపోతాయి. అయితే తత్కాల్ టికెట్లలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు రైల్వేశాఖ వీటి బుకింగ్స్ విధానాన్ని మార్చింది. అవేంటో ఇందులో చూద్దాం.

ఇక నుంచి తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ ఓటీపీని వెరిఫై చేయాలి. ఆన్ లైన్ లైదా ఆఫ్లైన్లలోనూ ఈ విధానం వర్తిస్తుంది. ఇందుకోసం ఐఆర్సీటీసీ యూజర్ ప్రొఫైల్కు ఆధార్ను లింక్ చేయాలి. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ లింక్ చేసిన యూజర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఇక టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ఆధార్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జులై 1,2025 నుంచి ఈ కొత్త రూల్ను రైల్వేశాఖ అమల్లోకి తెచ్చింది. ఇక కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, ఐఆర్సీటీసీ ఆధీకృత ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. అలాగే ఏజెంట్లకు మరో నియమం కూడా పెట్టారు.

ఇక ఏజెంట్లు టికెట్లు బుక్ చేయడానికి సమయ పరిమితిని విధించింది. ఏదైనా రైలుకు తత్కాల్ టికెట్లు రిలీజ్ అయిన సమయంలో తొలి 30 నిమిషాలు ఏజెంట్లు టికెట్లు బుక్ చేయలేరు. ఏసీ క్లాసులకు ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య టికెట్లను ఏజెంట్లు బుక్ చేయలేరని రైల్వేశాఖ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఇక నాన్ ఏసీ క్లాసులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల మధ్య ఏజెంట్లు తత్కాల్ టికెట్లను బుక్ చేయలేరు. కొంతమంది ఏజెంట్లు కొన్ని టూల్స్ ద్వారా తమ కస్టమర్లకు అత్యంత వేగంగా టికెట్లను బుక్ చేస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రయాణికులకు టికెట్లు లభించడం లేదు. దీనిని నివారించేందుకు రైల్వేశాఖ ఏజెంట్లకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.