
రైళ్లల్లో తరచూ లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. దేశంలో నలుమూలలకు రైల్వే నెట్వర్క్ విస్తరించి ఉంది. తక్కువ ఖర్చుతో సదూర ప్రాంతాలకు ప్రయాణించే సౌకర్యం రైల్వేలలో అందుబాటులో ఉంది. అంతేకాక సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం రైళ్ల ద్వారా చేయవచ్చు. దీంతో రైళ్లల్లో ప్రయాణించేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. ఈ కారణంతో రైళ్లల్లో టికెట్లు వెంటనే దొరకవు

రద్దీ కారణంగా చాలామంది ముందుగానే రైళ్లల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటూ ఉంటారు. లేదా టికెట్ బుక్ చేసిన వ్యక్తి కాకుండా మిగతావారు ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో టికెట్ను వేరేవారి పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం రైల్వేశాఖ కల్పిస్తోంది. అదెలా అనేది ఇందులో చూద్దాం.

ట్రైన్ టికెట్ను వేరేవారి పేరుపై బదిలీ చేయడానికి కొన్ని కండీషన్స్ అమల్లో ఉన్నాయి. కేవలం కుటుంబసభ్యుల పేరు మీదకు మాత్రమే టికెట్ను బదిలీ చయవచ్చు. భార్య, కుమారుడు, కుమార్తె, అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రుల మధ్య మాత్రమే టికెట్ల బదిలీకి అవకాశం ఉంది. ఇక వేరేవారి పేరు మీదకు మార్పిడి చేయడానికి నిబంధనలు అనుమతి ఇవ్వవు. టికెట్లను బ్లాక్లో అమ్ముకునే అవకాశం ఉండటంతో.. ఈ నిబంధనలు తెచ్చింది.

అయితే రైలు బయల్దేరడానికి 48 గంటల ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయం ముగిశాక అనుమతి ఉండదు. కేవలం చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్కు మాత్రమే టికెట్ను వేరేవారి పేరు మీదకు అనుమతించే అధికారం ఉంది. అయితే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా టికెట్లకు మార్పు చేసుకోవడానికి కుదరదు.

అయితే టికెట్ను కుటుంబసభ్యుల పేరుపైకి మార్చాలంటే సులువైన పని కాదు. ఇందుకోసం చాలా ప్రాసెస్ ఉంటుంది. తొలుత రిజర్వేషన్ కార్యాలయం చీఫ్ సూపర్వైజర్ను కాంటాక్ట్ అవ్వాలి. ఆ అధికారికి ఒక లిఖితపూర్వకంగా ఒక దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఆయన పరిశీలించి అనుమతి ఇస్తారు. అనంతరం కుటుంబసభ్యుల పేరు మీదకు టికెట్ బదిలీ అవుతుంది.