
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న దిగుమతి వ్యయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారులు మళ్లీ బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో, ఇప్పుడు ఏ లోహంలో పెట్టుబడి పెట్టడం మంచిదనే చర్చ మొదలైంది.

గత ఏడాది కాలంలో బంగారం సుమారు 47 శాతం రాబడిని ఇవ్వగా, వెండి ఏకంగా 147 శాతం లాభాలను అందించింది. అయినప్పటికీ, గత రాబడులను మాత్రమే చూసి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారాన్ని సాధారణంగా సురక్షిత పెట్టుబడిగా భావిస్తే, వెండి అధిక ఒడిదుడుకులకు లోనయ్యే కారణంగా ఎక్కువ రిస్క్ ఉన్న లోహంగా పరిగణిస్తారు.

వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం దాని పారిశ్రామిక వినియోగం వేగంగా పెరగడమే. ముఖ్యంగా సోలార్ ప్యానెల్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండికి భారీ డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో ఇటీవలి కాలంలో వెండి ధరలు బంగారం కంటే వేగంగా పెరిగాయి. ఇక బంగారం-వెండి నిష్పత్తి కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. 2026 ప్రారంభంలో 107గా ఉన్న ఈ నిష్పత్తి ప్రస్తుతం 55కు పడిపోయింది. అంటే వెండి ధరలు బంగారంతో పోలిస్తే వేగంగా పెరిగినట్లు అర్థం. అయితే ఇటీవలి భారీ ర్యాలీ తర్వాత వెండి ధరల్లో తాత్కాలిక సవరణ వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ రిస్క్ కోరుకునే వారు 70 శాతం బంగారం, 30 శాతం వెండిలో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న వారు 50-50 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టవచ్చని చెబుతున్నారు.

మొత్తం పెట్టుబడిలో 10-15 శాతం విలువైన లోహాల్లో ఉంచాలని, అందులో వెండి వాటా 5-10 శాతం వరకు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక స్థిరత్వానికి బంగారం, అధిక లాభ అవకాశాలకు వెండి అనుకూలమని, ఈ రెండింటి సమతుల్య కలయిక పెట్టుబడిదారులకు మెరుగైన వ్యూహమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.