
Gold Price: సాధారణంగా ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని 'సురక్షితమైన పెట్టుబడి' (Safe Haven)గా భావిస్తారు. కానీ ప్రస్తుత ఇరాన్ సంక్షోభంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయి గరిష్టాల తర్వాత బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా 22% పడిపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.

ధరల పతనానికి ప్రధాన కారణాలు: డాలర్ వైపు మొగ్గు: యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి అనిశ్చిత స్థితిలో పెట్టుబడిదారులు బంగారం కంటే అమెరికన్ డాలర్, బాండ్లపై ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారు. ఇది బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమైంది.

పారిశ్రామిక డిమాండ్ తగ్గడం: వెండి వినియోగంలో 60% పరిశ్రమల నుంచే ఉంటుంది. యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థ (Supply Chain) దెబ్బతినడంతో పారిశ్రామికంగా వెండికి డిమాండ్ తగ్గింది. ఫలితంగా బంగారం కంటే వెండి ధరల్లోనే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

కేంద్ర బ్యాంకుల విక్రయాలు: రష్యా, టర్కీ వంటి దేశాలు తమ కరెన్సీ విలువను కాపాడుకోవడానికి తమ వద్ద ఉన్న బంగారు నిల్వలను విక్రయిస్తున్నాయి. మార్కెట్లోకి బంగారం సరఫరా పెరగడంతో ధరలపై ఒత్తిడి పెరిగింది. ముడి చమురు ధరలు పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించవు. అధిక వడ్డీ రేట్లు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు వడ్డీ వచ్చే ఆస్తుల (Assets) వైపు వెళ్తారు తప్ప, వడ్డీ లేని బంగారంపై ఆసక్తి చూపరు.

ప్రాఫిట్ బుకింగ్: 2025లో బంగారం 75%, వెండి 165% లాభాలను అందించాయి. ఇప్పుడు పెద్ద ట్రేడర్లు తమ లాభాలను నగదుగా మార్చుకోవడానికి అమ్మకాలు జరపడంతో మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

నిపుణుల హెచ్చరిక: 2025లో చూసిన అసాధారణమైన పెరుగుదల మళ్ళీ ఇప్పట్లో కనిపించడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ముగిసి, పరిస్థితులు చక్కబడే వరకు మార్కెట్ ఏ దిశలో వెళ్తుందో చెప్పలేమని, కొత్త పెట్టుబడిదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.