
సామాన్యులకు రానున్న కొద్ది నెలల్లో ఊరట లభించనుందని తెలుస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు రానున్న నెలల్లో తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుండటం, ముడి పదార్థాల ధరలు తగ్గుతుండమే ఇందుకు కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి వస్తువుల ధరలు రానున్న కొద్ది నెలల్లో తగ్గే అవకాముందనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

బిస్కెట్లు, సబ్బులు, నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి రోజువారీ ఇంట్లో ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు చౌకగా మారే అవకాశముంది. దేశంలోని ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఈ మేరకు ధరలను తగ్గించేందుకు ముందడుగు వేస్తున్నాయి. ఇటీవల వస్తువుల తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ధరలు పెరగ్గా.. ఇప్పుడు పరిస్ధితి కాస్త మెరుగుపడుతుంది. ఇప్పుడిప్పుడు ముడి పదార్థాల ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

నూనె, గోధుములు, కొబ్బరి, ఇతర ముఖ్యమైన రసాయనాల ధరలు భారీగా తగ్గముఖం పట్టాయి. దీంతో కంపెనీలకు కూడా వస్తువుల తయారీపై అయ్యే ఖర్చు తగ్గింది. ఖర్చులు తక్కువగా అవుతున్నప్పుడు ధరలను పెంచాల్సిన అవసరం లేదని కంపెనీలు చెబుతున్నాయి. వచ్చే ఆర్దిక సంవత్సరంలో ధరలను పెంచడం కంటే అమ్మకాల పరిమాణం పెంచుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి.

వస్తువులను పెద్ద సంఖ్యలో అమ్మడం, మరిన్ని వస్తువులను విక్రయించడం ద్వారా వృద్ది సాధించేందుకు కంపెనీలను రెడీ అవుతున్నాయి. మద్దతు ధరలు పెరగడం, జీఎస్టీ రేట్లు తగ్గింపు వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. దీని వల్ల అమ్మకాలు ఎక్కువగా జరగడం వల్ల ఆదాయం లభిస్తుందని కంపెనీలు చెబుతున్నాయి.

ద్రవ్యోల్బణం తగ్గుతుండటంతో ముడి పదార్ధాల ధరలు తగ్గుతున్నాయి. దీంతో రానున్న కొద్ది నెలల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు ఎఫ్ఎమ్సీజీ కంపెనీలు సిద్దమవుతున్నాయి. ముడి పదార్ధాల ధరలు అందుబాటులో ఉండి బలమైన డిమాండ్ ఉంటే గణనీయమైన తగ్గింపును ఆశించవచ్చని కంపెనీలు చెబుతున్నాయి.