అధిక పెన్షన్ దరఖాస్తు గడువు విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మే3 తో గడువు ముగియనున్న నేపథ్యంలో మంగళవారం సమావేశమైన EPFO రిటైర్మెంట్ ఫండ్ బాడీ.. మంగళవారం జూన్ 26 వరకు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించింది. సమయాన్ని పొడిగించాలని కోరుతూ వివిధ సంఘాల నుంచి వినతుల మేరకు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది.
ఈపీఎఫ్ఓ ఉద్యోగుల సమస్యను పరిగణలోకి తీసుకున్నామని.. అధిక పెన్షన్ విషయంలో మరింత అవకాశాలను అందించడానికి, అర్హులైన వ్యక్తులందరూ తమ దరఖాస్తులను ఫైల్ చేయడానికి 26 జూన్, 2023 వరకు గడువును నిర్ణయించినట్లు ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ లో తెలిపింది.
పింఛనుదారులు/సభ్యులు ఎదుర్కొంటున్న ఏవైనా ఇబ్బందులను తగ్గించేందుకు వారికి సులభతరమైన అవకాశాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని.. ఉద్యోగులు, యజమానులు, వారి సంఘాల నుంచి వచ్చిన వివిధ డిమాండ్లను సానుభూతితో పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.
2014కు ముందు సర్వీసులో చేరి, ఆ తరువాత కొనసాగుతూ వాస్తవిక వేతనం (ఈపీఎఫ్వో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలకన్నా ఎక్కువ) పై ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్న కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న తన ఆదేశాలలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అర్హతగల సభ్యులందరికీ అధిక పెన్షన్ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది.
సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం పెన్షనర్లు / సభ్యుల నుంచి ఆప్షన్ / జాయింట్ ఆప్షన్ ధ్రువీకరణ కోసం దరఖాస్తులను పొందేందుకు EPFO ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్ సౌకర్యం 03.05.2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. దానిని పొడగించింది.
ఈపీఎఫ్ఓ కమీషనర్ సూచించిన దరఖాస్తు ఫారమ్లో, జాయింట్ డిక్లరేషన్ మొదలైన అన్ని ఇతర అవసరమైన పత్రాలలో మరింత ప్రయోజనం కోసం అర్హులైన చందాదారులు తమ యజమానితో సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.