
బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు ఇటీవల పెరిగిపోతున్నారు. ఫిజికల్ బంగారం కొని పెట్టుకోవడం కంటే డిజిటల్ విధానంలో కొనుగోలు చేస్తున్నారు. గత రెండేళ్లల్లో రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్లు పెరగ్గా.. రానున్న రోజుల్లో మరింత పెరిగితే లాభం వస్తుందనే ఉద్దేశంతో డిజిటల్ గోల్డ్ కొంటున్నారు. డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. యాప్స్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేయవచ్చు.

ఒకవేళ విక్రయించాలనుకున్నా సెకన్లలోనే డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. ఇక బంగారం కావాలనుకుంటే మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా సులువుగా డిజిటల్ గోల్డ్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటివరకు డిజిటల్ గోల్డ్పై నియంత్రణ లేకపోవడంతో పెట్టుబడి పెట్టేవారికి రక్షణ ఉండటం లేదు. ఈ క్రమంలో డిజిటల్ గోల్డ్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

డిజిటల్ గోల్డ్ను ఆర్బీఐ, సెబీ పర్యవేక్షణలోకి తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ పెట్టుబడులపై ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రతీ డిజిటల్ గోల్డ్ యూనిట్కు ఫిజికల్ బులియన్ బ్యాకింగ్ ఉండేలా చేయాలని కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఆర్బీఐ, సెబీ పర్యవేక్షణలోకి తీసుకొస్తే నియంత్రణ ఉంటుందని భావిస్తోంది

ఇప్పటికే బ్యాంకులు, రెగ్యూలేటర్లతో కేంద్ర ఆర్ధికశాఖ సంప్రదింపులు జరిపింది. సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) యాక్ట్, 1956 కింద డిజిటల్ గోల్డ్ను సెక్యూరిటీగా గుర్తించాలనే ప్రతిపాదనకు అన్ని వర్గాల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటివరకు సెక్యూరిటీలుగా డిజిటల్ గోల్డ్ నోటిఫై కాలేదు. కమోడిటీ డెరివేటివ్స్గా కూడా నియంత్రణ లేదు.

మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్ల తరహాలో డిజిటల్ గోల్డ్కు రెగ్యూలేటరీ రక్షణ లేదు. ఇప్పటివరకు డిజిటల్ గోల్డ్ ఇండస్ట్రీలో 3 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇప్పటివరకు వీటికి అనుమతి లేకపోవడం వల్ల అనధికార అపరేటర్లు కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో మనీలాండరింగ్ వంటివి కూడా చోటుచేసుకుంటున్నాయి.