
కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. వీటిని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇక ఉద్యోగం కల్పించిన కంపెనీకి కూడా ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.3 వేల వరకు జమ చేస్తారు. గత ఏడాది ఆగస్ట్ 15న ఈ పథకం గురించి మోదీ ప్రకటన చేశారు.

2025-26 బడ్జెట్లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కొత్తగా ఉద్యోగి చేరి ఈపీఎఫ్వోలో నమోదు చేసుకున్న ఉద్యోగులకు రూ.15 వేల సాయం అందిస్తారు. ఇక ఉద్యోగం ఇచ్చిన కంపెనీకి ఒక్కో ఉద్యోగికి రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు కంపెనీకి ఇస్తారు. గతంలో ఎంప్లామెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఈ పథకాన్ని అమలు చేశారు.

ఉద్యోగంలో చేరిన తర్వాత రెండు విడతలుగా వీటిని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. గరిష్టంగా రూ.లక్ష వరకు జీతం ఉన్నవారు ఈ పథకం కింద లబ్ది పొందవచ్చు. 6 నెలల పాటు ఉద్యోగం చేశాక రూ.7,500, ఏడాది తర్వాత రూ.7,500 చెల్లిస్తారు. ఇక కొత్త ఉద్యోగుల వేతనాల ఆధారంగా కంపెనీకి ప్రోత్సాహకం అందిస్తారు.

ఉద్యోగి వేతనం రూ.10 వేల వరకు ఉంటే కంపెనీకి నెలకు రూ.వెయ్యి ప్రోత్సాహకం అందిస్తారు. ఇక రూ.20 వేల వరకు ఉంటే రూ.2 వేలు, రూ.లక్షల వరకు ఉంటే రూ.3 వేలు ఇస్తారు. ఈ పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఉద్యోగంలో చేరి పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ పథకాన్ని అర్హులు అవుతారు. ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ ఆధారంగా ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేస్తుంది.

ఉద్యోగి జీతం రూ.లక్ష కంటే తక్కువగా ఉండాలి. ఇక ఆధార్ కార్డ్, ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింకింగ్, అపాయింట్మెంట్ లెటర్, ఈపీఎఫ్వో అకౌంట్ కలిగినవారు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగి 6 నెలల పాటు ఒకే కంపెనీలో పని చేసి ఉండాలి. ఉద్యోగి గతంలో పీఎఫ్ అకౌంట్ కలిగి ఉండకూడదు.