
వాహనదారులకు కేంద్రం ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. తాజాగా కొత్త టోల్ ఫీజు నిబంధలను తీసుకొచ్చింది. జాతీయ రహదారుల ఛార్జీలు నియమాల 2026 పేరుతో కొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది. ఈ నియమాల ప్రకారం.. టోల్ ఫీజు చెల్లించనివారికి ఇప్పటినుంచి భారీగా జరిమానా పడుతుంది. టోల్ ఛార్జి చెల్లించకుండా ఎగ్గొడితే రెట్టింపు స్థాయిలో జరిమానా కట్టాల్సి ఉంటుంది

చెల్లించనివారికి ఈ-నోటీస్ జారీ చేస్తారు. ఎస్ఎంఎస్, ఈమెయిల్స్, మొబైల్ అప్లికేషన్లు, ఇతర ఆధారిత ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా నోటీసులు అందిస్తారు. ఇక కొన్ని ఆన్ లైన్ పోర్టల్స్లో కూడా ఈ-నోటీసులను యాక్సెస్ చేయవచ్చు. టోల్ ఫీజు ఎగ్గొట్టిన వారిని సులభంగా గుర్తించి వసూలు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

జాతీయ ఎలక్ట్రానిక్ టోల్ ఫీజు వసూలు వ్యవస్థను వాహనాల డేటా బేస్కు అనుసంధానించనున్నారు. టోల్ ఫీజు చెల్లించకుండా పోయినప్పుడు వాహన యజమానికి ఎలక్ట్రానిక్ పద్దతిలో ఈ-నోటీస్ అందుతుంది. ఈ నోటీసులో వాహన వివరాలు, ప్రయాణించిన తేదీ, ప్రదేశం ఉంటాయి. నోటీస్ అందించిన 72 గంటల్లోపు చెల్లిస్తే ఎలాంటి జరిమానా ఉండదు.

ఇక నోటీసులపై ఫిర్యాదు చేసేందుకు కూడా వాహనదారులకు కేంద్రం అనుమతి ఇస్తుంది. ఈ నోటీస్ అందిన 72 గంటల్లోపు నిర్దేశిత పోర్టల్లో వినతిపత్రం అందించవచ్చు. అధికారులు 5 రోజుల్లోగా స్పందించిన మీ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులపై టోల్ వసూళ్లలో పారదర్శకతను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది.

అదే 72 గంటల్లోపు టోల్ చెల్లించకపోతే భారీగా జరిమానా విధిస్తారు. అలాగే 15 రోజుల్లోగా చెల్లించకపోతే వాహనంపై ఆంక్షలు, రాకపోకలపై పరిమితులు వంటివి విధిస్తారు. టోల్ ఫీజు వసూలు చేయడంలో పారదర్శకత తెచ్చేందుకు, మరింత బలోపేతం చేసేందుకు ఈ కొత్త రూల్స్ కేంద్రం తీసుకొచ్చింది.