
సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో బ్యాంకులు, టెలికాం కంపెనీలు వినియోగదారుల భద్రత కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను చోరీ చేస్తున్న క్రమంలో దీనిని నివారించే చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా సైలెంట్ అథెంటిఫికేషన్ ఫీచర్పై పనిచేస్తున్నాయి. ఓటీపీ అవసరం లేకుండానే బ్యాంక్ లావాదేవీలు చేసేలా కొత్త వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సిమ్ క్లోనింగ్, ఈ-సిమ్ మోసాలను అరికట్టడానికి ఈ కొత్త మెకానిజం ఉపయోగపడనుంది.

సైలెంట్ అథెంటిఫికేషన్ అంటే ఒకరకంగా బ్యాక్గ్రౌండ్ చెక్ అని అర్థం. అంటే మీ బ్యాంక్ యాప్తో లింక్ అయిన మొబైల్ నెంబర్, మీ ఫోన్లోని సిమ్ కార్డు నెంబర్ రెండూ ఒక్కటేనా అనేది వెరిఫై చేస్తుంది. ఒకవేళ రెండూ ఒకేలా లేకపోతే సదరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనుమానాస్పదంగా గుర్తిస్తుంది. ఆ లావాదేవీ జరగకుండా ఆటోమేటిక్గా నిరోధిస్తుంది. ఈ-సిమ్లపై కూడా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది.

మెసగాళ్లు తరచుగా ఓటీపీలను దొంగలించి సిమ్ క్లోనింగ్, ఈ-సిమ్ స్వైపింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న క్రమంలో అదనపు భద్రతగా సైలెంట్ అథెంటిఫికేషన్ ఫీచర్ అనేది సహాయపడుతుంది. మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన సిమ్ కార్డు నెంబర్ మీ ఫోన్లో ఉందో.. లేదో చెక్ చేస్తుంది. ఇక ఈ-సిమ్ ద్వారా జరిగే మోసాలను అరికడుతుంది.

బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన మొబైల్ నెంబర్, ఫోన్లోని సిమ్ కార్డు నెంబర్ ఒక్కటేనా అనేది బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా చెకింగ్ జరుగుతుంది. దీని వల్ల బ్యాంక్ ఓటీపీల పని ఉండదు. సైబర్ నేరగాళ్లు ఓటీపీల ద్వారా చేసే మోసాలకు ఫుల్ స్టాఫ్ పడుతుంది. ప్రస్తుతం టెలికాం కంపెనీలతో ట్రయల్స్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ మార్పు బ్యాంకింగ్ రంగంలో రానుంది.

మరోవైపు బ్యాంకులు ఫోన్కు ఎస్ఎంఎస్ల ద్వారా ఓటీపీలు కాకుండా తమ సొంత యాప్ల ద్వారా పంపించే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. అన్ని డిజిటల్ లావాదేవీలకు రెండు అంచెల భద్రతను ఏప్రిల్ 1 నుంచి ఆర్బీఐ తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో సైలెంట్ మెకానిజంపై బ్యాంకులు వర్క్ చేస్తున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ఓటీపీల వ్యవస్థకు చెక్ పడనుంది.