
ఏసీబీ దాడిలో లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి, ఆఫీసులోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఆఫీసర్, ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం.. అంటూ ఇలాంటి వార్తలు మీరు చూసే ఉంటారు. అంతేకాదు టీవీల్లో, న్యూస్ పేపర్లు ఇలాంటి తరచూగా కనిపిస్తుంటాయి. లంచం తీసుకుంటూ పట్టుబడిన సమయంలో అధికారులు పింక్ కలర్ బాటిళ్లను ప్రదర్శిస్తుంటారు. డబ్బులతో పాటు పింక్ కలర్ బాటిళ్లు కనిపిస్తుంటాయి. మరి ఈ పింక్ బాటిళ్లు ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం.

ఏసీబీ అధికారులు లంచం తీసుకున్న వారిని పట్టుకునేందుకు రకరకల ప్లాన్స్ వేస్తుంటారు. ఇందులో భాగంగానే వారిని సాక్షాలతో పట్టుకునేందుకు ఒక పని చేస్తారు.

ఎవరైనా అధికారి లంచం డిమాండ్ చేయగానే సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖకు తెలియజేస్తాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముందుగా సదరు అధికారికి ఇచ్చే లంచం కరెన్సీ నోట్లపై ఎలాంటి అనుమానం రాకుండా ఫినాఫ్తలిన్ పౌడర్ను జల్లుతారు. దీంతో డబ్బులు తీసుకున్న వ్యక్తి డబ్బను లెక్కించే సమయంలో చేతులకు ఫినాఫ్తలిన్ పౌడర్ అంటుకుంటుంది. డబ్బు చేతులు మారగానే ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇస్తారు. అప్పుడు ఉంటుంది అసలైన కథ. అనంతరం లంచం తీసుకున్న వ్యక్తి చేతులను సోడియం కార్బోనేట్ కలిపిన నీటిలో చేతులని ముంచాలని చెబుతారు.

ఫినాఫ్తలీన్ పౌడర్ అంటుకుని ఉన్న చేతులను ఈ నీటిలో ముంచడం వల్ల ఆ నీరు పింక్ కలర్లోకి మారుతుంది. సోడియం కార్బోనేట్ అనేది ఆల్కలైన్ ద్రావణం. అందుకే పింక్ కలర్ ఏర్పడుతుంది.

ఈ పింక్ కలర్ వాటర్ను కోర్టులో సాక్ష్యంగా చూపించడం ద్వారా లంచం తీసుకున్న అధికారికి శిక్ష పడేలా చేస్తారు అధికారులు. అందుకనే లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుకున్న సమయంలో ఈ పింక్ బాటిళ్లు దర్శనమిస్తూ ఉంటాయి.