కర్ణాటకలోని బీదర్ కోట బహమనీ సుల్తానుల సామ్రాజ్యానికి నిదర్శనంగా నేటికి నిలిచి ఉంది. అయితే పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చారిత్రాత్మక బీదర్ కోటకు ఒక వైపు గోడలపై మొక్కలు, పొదలు గుబురుగా పెరగడంతో అది మొత్తం కూలిపోయే పరిస్థితి నెలకొంది.
ఎత్తైన గోడ పైభాగంలో మొక్కలు విపరీతంగా పెరిగి పాతుకుపోయాయి. ఆ మొక్కల వేళ్లు గోడ లోలోతుల్లోకి వెళ్లడంతో గోడ కూలిపోయేలా ఉందని స్థానికులు అందోళన చెందుతున్నారు.
బీదర్ జిల్లా కలెక్టరేట్ నివాసం నుంచి సబ్ రిజియన్ సైన్స్ సెంటర్ వరకు విస్తరించి కోట గోడ అందానికి ప్రకృతి సిద్ధంగా పెరిగే వృక్ష సంపద ఆపదగా మారింది. ఒకవేళ మొక్కలు అలాగే పెరిగిపోయి, గోడ పగిలితే మళ్లీ మరమ్మతులు చేయడం దాదాపుగా అసాధ్యమే.
ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు మేల్కొని బీదర్ కోట అందాలకు అడ్డుగా పెరిగిన మొక్కలను తొలగించాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.
ఇస్లామిక్, పర్షియన్ వాస్తు శిల్పం, మసీదులు, మహల్లు, ముప్పైకి పైగా ఇస్లామిక్ స్మారక చిహ్నాలు.. ఇలా ఎన్నో ఈ బీదర్ కోట సొంతం. ఇక ఈ బీదర్ కోట కర్ణాటక ఉత్తర కొనలో బీదర్ జిల్లాలో ఉంది.