
ప్రముఖ పంచారామక్షేత్రమైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రావణ పట్టీ (సారె) సమర్పణ మహోత్సవంలో భాగంగా భక్తులు పార్వతీదేవి, అన్నపూర్ణ అమ్మవార్లకు అత్యంత భక్తిశ్రద్ధలతో సారెను సమర్పించారు.

ఈ వేడుకలో భాగంగా ఏకంగా 8,000 కేజీల వివిధ రకాల మిఠాయిలు, పండ్లతో కూడిన భారీ సారెను అమ్మవార్లకు సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రకరకాల స్వీట్లు, పండ్లతో అలంకరించిన ఎడ్లబండ్లతో భక్తులు భారీ ఊరేగింపు నిర్వహించారు.

ఈ శోభాయాత్ర సోమగుండం చెరువు వద్ద ప్రారంభమై నాచువారి సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ప్రధాన ఆలయానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని మంగళహారతులతో ఊరేగింపులో నడిచారు.

ఆలయానికి చేరుకున్న అనంతరం సోమేశ్వరస్వామి, పార్వతీదేవి, అన్నపూర్ణ అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు తెచ్చిన సారెను సమర్పించారు. శ్రావణ మాసంలో అమ్మవార్లకు సారె సమర్పించడం వల్ల సకల శుభాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), ఆలయ కమిటీ చైర్మన్ బంగార్రాజు, పాలకవర్గ సభ్యులు, అర్చకులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ సారె ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు.