
తెలుగురాష్ట్రాలకు వాతవరణ శాఖ శుభవార్త చెప్పింది. వాయువ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ఏర్పడిన నిన్నటి అల్పపీడన ప్రాంతం, ఈ రోజు ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగుతొందని.. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్ళేకొలది అది నైరుతి దిశగా వంగి ప్రయాణిస్తోందని తెలిపింది.

ఇది రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని.. అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. ఈదురు గాలులు గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.

ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలో శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవిస్తాయిని.. అలాగే వర్షాల సమయంలో గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది..

ఇక అటు తెలంగాణలోనూ శుక్ర, శనివారంలో రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని.. అలాగే ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వర్షంతో పాటు 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.