
రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అండగా నిలిచేందు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మార్కెట్ ధర కంటే తక్కు ధరకే ప్రజలకు బియ్యం విక్రయించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్లో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల ప్రత్యేక కౌంటర్లలో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ. 52కు, బీపీటీ రా రైస్ కేజీ రూ. 50 లకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం చొప్పున కౌంటర్లలో అందజేస్తున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి, సమీక్ష చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రజలకు అందుబాటులో ప్రత్యేకంగా తక్కువ ధరకు బియ్యం అమ్మాలని నిర్ణయించామని తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్ర రైస్ మిల్లర్లతో చేసిన చర్చల్లో భాగంగా తక్కువ ధరకే బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామన్నారు.

దీనికి రైస్ మిల్లర్లు కూడా సహకరిస్తామని ముందుకు రావడం అభినందనీయమని మంత్రి అన్నారు. బహిరంగ మార్కెట్లో రూ. 65 నుంచి రూ. 62 లకు లభ్యమవుతున్న బిపిటి సూపర్ ఫైన్ రకం బియ్యం.. ప్రత్యేక కౌంటర్లలో రూ. 52కు, బహిరంగ మార్కెట్లో రూ.58 రూపాయల నుంచి రూ.60 ధరకు దొరుకుతున్న బియ్యాన్ని రూ. 50 కు అందింస్తున్నట్టు తెలిపారు. నేటి నుంచి అన్ని కౌంటర్లలో బియ్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.

భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ కూడా తక్కువ ధరలకు అందించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని.. ప్రజలకు కష్టం రాకమునుపే అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆయన తెలిపారు. ఈ తక్కువ ధరలకే బియ్యం కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.