
ఉపరితల ఆవర్తన ప్రభావంతో 24 గంటల్లోపు వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్ , హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించారు.

శనివారం (08-08-2026): శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.

అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అటు తెలంగాణకు కూడా వర్షసూచనలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తణం ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈమేరకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అర్ట్ కూడా జారీ చేసింది.

ముఖ్యంగా ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్, నిజామాబాద్, కుమురం భీమ్, నిర్మల్, మేడక్ జిల్లాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం సమయంలో గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది.