
ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ, సగటు సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఇది సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో సెప్టెంబర్ 19,వ తేది సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత, ఇది క్రమంగా బలపడి, తదుపరి 3-4 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అలాగే ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని.. మరాఠ్వాడా, దాని పరిసర ప్రాంతాల నుండి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఈరోజు బలహీనపడిందని తెలిపింది.

వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో సెప్టెంబర్ 18, 19 తేదీల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక 20వ తేదీన ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. శని, ఆదివారాల్లో ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే ఛాన్స్ ఉందని.. అలాగే వర్షాల సమయంలో గంటలకు 40 -50 కిలోమీటర్ల వేగముతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

ఇక ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉందని.. దీని ప్రభావంతో అటు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవాకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.