
సంగారెడ్డి పట్టణంలో చిన్నారులు పాదముద్రలతో అద్భుతం చేశారు. శాస్త్రీయ నృత్యం కూచిపూడిలో తమ ప్రతిభను చాటి 'వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించారు. నక్షత్ర స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక నృత్య ప్రదర్శన ఆహూతులను మంత్ర ముగ్ధులను చేసింది. సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం కళాకాంతులతో మెరిసిపోయింది.

గజ్జెల సవ్వడితో, మువ్వల చప్పుళ్లతో చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శనలో రికార్డు సృష్టించారు. నక్షత్ర స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీ నిర్వాహకురాలు గీతా యజ్ఞశ్రీ ఆధ్వర్యంలో ఏకంగా 150 మంది చిన్నారులు ఏకకాలంలో సామూహికంగా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు.

చిన్నారుల అద్భుత ప్రదర్శనను వీక్షించిన 'వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్' ప్రతినిధులు, ఈ ఘనతను రికార్డుల్లో నమోదు చేశారు. అకాడమీ నిర్వాహకురాలు గీతా యజ్ఞశ్రీకి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, కోఆర్డినేటర్ రవి కుమార్ ధ్రువీకరణ పత్రంతో పాటు మెడల్ అందజేసి ఘనంగా సత్కరించారు.

తెలుగు వారి గొప్ప సంస్కృతి అయిన కూచిపూడిని నేటి తరానికి అందించడమే మా లక్ష్యం అని..150 మంది చిన్నారులు కష్టపడి ఈ ప్రదర్శన ఇచ్చారు. వీరికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడం చాలా గర్వంగా ఉందన్నారు డ్యాన్స్ టీచర్ గీతా.

చిన్నారుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది చిన్నారులు ఒకేసారి లయబద్ధంగా నాట్యం చేయడం సంగారెడ్డిలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.