
తనను రాపిడో డ్రైవర్ గుర్తుతెలియని మార్గంలో తీసుకెళ్తున్నాడని భయపడి ఓ యువతి బైక్పై నుంచి దూకేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. రన్నింగ్ బైక్పై నుంచి పడిపోవడంతో ఆమె చేతులు, కాళ్లు, తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకుంది. రాపిడో డ్రైవర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఆయేషా శ్రీవాత్సవ అనే యువతి ఆఫీసుకు వెళ్లేందుకు రాపిడో బైక్ను బుక్ చేసుకుంది. అయితే రోజూ వెళ్లే మార్గంలో కాకుండా డ్రైవర్ ఆమెను నిర్మానుష్యంగా, తనకు తెలియని దారిలో తీసుకెళ్తున్నట్లు గమనించింది. దీనిపై ప్రశ్నించగా, యూనివర్సిటీకి ఇదే షార్ట్కట్ అని డ్రైవర్ సమాధానమిచ్చాడు. ఈ మార్గం తనకు అసౌకర్యంగా ఉందని, వేరే రూట్లోనైనా వెళ్లాలని లేదా బైక్ ఆపాలని ఆమె కోరింది.
ఆమె పదే పదే వేడుకున్నా డ్రైవర్ పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. బైక్ ఆపించేందుకు అతన్ని కొట్టడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక, భయంతో ఆమె బైక్పై నుంచి కిందకు దూకేసింది. అనంతరం రాపిడో కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదని ఆమె ఆరోపించింది.
ఇది మహిళల భద్రతకు సంబంధించిన విషయమని.. తనకు ఆ రాపిడో డ్రైవర్ వివరాలు కావాలని.. దీనిపై మీరేం చేయబోతున్నారో కూడా తెలియాలని ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా రాపిడో యాజమాన్యాన్ని ప్రశ్నించారు. డ్రైవర్ పూర్తి వివరాలతో వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం చూపాలని.. ఆ డ్రైవర్కు కచ్చితంగా శిక్ష పడాలి అని ఆమె వీడియోలో చెప్పుకొచ్చారు.
వీడియో చూడండి..
అయితే ఈ పోస్ట్ కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ ఘటనపై రాపిడో స్పందించింది. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన సదురు రైడర్ను తమ ప్లాట్ఫామ్ నుండి శాశ్వతంగా సస్పెండ్ చేశామని, చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఆమెకు హెల్ప్ చేసేందుకు రైడర్ వివరాలు కూడా ఆమెకు షేర్ చేసినట్టు తెలిపింది. ఆమెకు అవసరమైన ఏ చట్టపరమైన లేదా వైద్య సహాయానికైనా తాము అండగా ఉంటామని, తదుపరి సహాయం కోసం అందుబాటులో ఉంటామని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.