సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య హితబోధ

చట్టాలు, ముఖ్యమైన అంశాలపై అర్థవంతమైన, విస్తృతమైన చర్చల ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులకు సూచించారు.

సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య హితబోధ

Updated on: Sep 14, 2020 | 9:05 PM

చట్టాలు, ముఖ్యమైన అంశాలపై అర్థవంతమైన, విస్తృతమైన చర్చల ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులకు సూచించారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారిని అదుపుచేయడం, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనంతో పాటు సాధారణ సామాజిక స్థితులు నెలకొనాలని ఆశిస్తున్న ప్రజలు.. ఈ సమావేశాలపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా సరైన మార్గదర్శనం జరిగేలా సమావేశ నిర్వహణకు సహకరించాలన్నారు. కేవలం 18 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల షెడ్యూల్ నేపథ్యంలో కీలకమైన చట్టాలు, కరోనా సహా ఇతర సమాజ ప్రయోజనకర అంశాలకు సంబంధించిన బిల్లులపై అర్థవంతమైన చర్చలో భాగస్వాములు కావడంపైనే అందరూ దృష్టిసారించాలన్నారు. 175 రోజుల విరామం తర్వాత సభ్యులందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందన్న చైర్మన్,100 ఏళ్ల క్రితం విధ్వంసం సృష్టించిన స్పానిష్ ఫ్లూ తర్వాత అదే స్థాయిలో మానవాళిని కరోనా మహమ్మారి ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశమైన భారత్‌, కరోనా బాధితులు, మరణాల రేటును వీలైనంతగా తగ్గించడంలో విజయం సాధించిందన్నారు. సోమవారం హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని భారతీయ భాషలకు సమాన గౌరవం కల్పించాలని హిందీతోపాటు అన్ని భారతీయ భాషలను నేర్చుకునేందుకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరముందని వెంకయ్య తన ప్రసంగంలో పేర్కొన్నారు. అనంతరం, హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ 14వ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వారికి చైర్మన్ వెంకయ్య నాయుడు, ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us