
ఉత్తరప్రదేశ్లో ఒక రహదారి నిర్మాణం చుట్టూ ఆసక్తికరమైన రాజకీయ డ్రామా నడుస్తోంది. ఏళ్లుగా అధ్వాన్నంగా ఉన్న ఒక రోడ్డు నిర్మాణ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు ఇద్దరు ప్రజాప్రతినిధులు పోటీ పడటంతో, కేవలం 12 గంటల వ్యవధిలోనే ఆ రహదారికి రెండుసార్లు శంకుస్థాపన జరిగింది. ఈ క్రెడిట్ పాలిటిక్స్ ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రాయ్బరేలీ నగరంలోని ఐటీఐ టర్న్ నుండి ప్రసిద్ధ, ప్రాచీన అభయదాత ఆలయాన్ని కలిపే రహదారి చాలా కాలంగా శిథిలావస్థలో ఉంది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో స్థానిక నివాసితులకు, ప్రతిరోజూ ఆలయాన్ని సందర్శించే వేలాది మంది భక్తులకు నరకం కనిపిస్తోంది. అయితే, ఈ సమస్యపై ఏళ్లుగా అధికారులు గానీ, పాలకులు గానీ స్పందించలేదు.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే ‘పల్లు’ అని కూడా పిలువబడే స్థానిక సామాజిక కార్యకర్త వివేక్ మిశ్రా చొరవ తీసుకున్నారు. ఆయన స్వయంగా ముందుకు వచ్చి, రోడ్డుపై ఉన్న గుంతలను రాళ్లతో పూడ్చడమే కాకుండా, భక్తుల సౌకర్యార్థం 15 వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ రహదారి సమస్య అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో, ప్రజల్లో చర్చ జరగడంతో రాజకీయ నాయకుల్లో కదలిక వచ్చింది.
రోడ్డు నిర్మాణ ప్రక్రియ వేగవంతం కావడం వెనువెంటనే.. క్రెడిట్ కోసం రాజకీయ పోరు మొదలైంది. మొదట రాయ్బరేలీ సదర్ ఎమ్మెల్యే అదితి సింగ్ ఈ రహదారి నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేశారు. అయితే ఈ ఘనత తనదేనంటూ మరుసటి రోజు ఉదయమే మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు శత్రుహన్ సోంకర్ కూడా అదే రహదారికి రెండోసారి శంకుస్థాపన చేశారు. ఇలా 12 గంటల తేడాలో ఇద్దరు నేతలు కొబ్బరికాయలు కొట్టడం నవ్వులాటగా మారింది.
ఈ రాజకీయ ఘర్షణలు ఎలా ఉన్నప్పటికీ, ఏళ్లుగా నరకం చూస్తున్న స్థానికులకు, భక్తులకు మాత్రం ఇది పెద్ద ఉపశమనం కలిగించనుంది. నేతల మధ్య పోటీ వల్లనైనా రోడ్డు పనులు వేగంగా పూర్తవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాయకులకు క్రెడిట్ ముఖ్యం కావచ్చు, కానీ తమకు రోడ్డు ముఖ్యం అని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..