క్వాడ్ సమావేశం, ఇంధన చర్చలే లక్ష్యం.. తొలిసారి భారత్‌కు విచ్చేసిన మార్కో రూబియో!

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తన నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శనివారం (మే 23, 2026) కోల్‌కతా చేరుకున్నారు. ఆయన భారతదేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2012 మే నెలలో హిల్లరీ క్లింటన్ పర్యటన తర్వాత ఒక అమెరికా విదేశాంగ కార్యదర్శి ఈ తూర్పు మహానగరం కోల్‌కతా సందర్శించడం మళ్లీ ఇప్పుడే కావడం విశేషం.

క్వాడ్ సమావేశం, ఇంధన చర్చలే లక్ష్యం.. తొలిసారి భారత్‌కు విచ్చేసిన మార్కో రూబియో!
Us Secretary Of State Marco Rubio

Updated on: May 23, 2026 | 8:47 AM

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తన నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శనివారం (మే 23, 2026) కోల్‌కతా చేరుకున్నారు. ఆయన భారతదేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2012 మే నెలలో హిల్లరీ క్లింటన్ పర్యటన తర్వాత ఒక అమెరికా విదేశాంగ కార్యదర్శి ఈ తూర్పు మహానగరం కోల్‌కతా సందర్శించడం మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చిన కొద్ది వారాలకే ఈ పర్యటన జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘X’ వేదికగా స్పందిస్తూ.. రూబియో కోల్‌కతా చేరుకున్నారని, ఆ తర్వాత న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ, క్వాడ్ వంటి కీలక రంగాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుడు దార్శనికతకు అనుగుణంగా అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

కోల్‌కతాలో రూబియో సెయింట్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయమైన ‘మదర్ హౌస్’తో పాటు చిల్డ్రన్స్ హోమ్‌ను కూడా సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. మే 23 నుండి 26 వరకు సాగే ఈ పర్యటనలో కోల్‌కతాతో పాటు ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలను సందర్శిస్తారు. ముఖ్యంగా ఇంధన చర్చలు, క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈ పర్యటనలో అత్యంత కీలకం కానున్నాయి.

పర్యటనకు బయలుదేరే ముందు రూబియో మయామిలో మీడియాతో మాట్లాడుతూ.. “భారతదేశానికి అవసరమైనంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అమెరికా ఇంధన ఉత్పత్తి, ఎగుమతులు చారిత్రాత్మక స్థాయిలో ఉన్నాయి” అని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగి భారత్‌పై పడుతున్న ప్రభావం గురించి ప్రశ్నించగా.. భారతదేశాన్ని ఆయన ఒక “గొప్ప భాగస్వామి”గా ఆయన అభివర్ణించారు. మే 26న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అధ్యక్షతన జరగనున్న క్వాడ్ సమావేశంలో రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మొటెగి తోషిమిత్సు పాల్గొననున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల దౌత్య సంబంధాలలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us