
భవిష్యత్ అవసరాలు, క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు.. క్రిటికల్ మినరల్స్ చాలా కీలకం. భారతదేశంతోపాటు యావత్ ప్రపంచం ఇవాళ క్రిటికల్ మినరల్స్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. క్రిటికల్ మినరల్ రంగంలో భారతదేశ కీలకంగా మారబోతుందని ఆయన తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ డెవలప్మెంట్, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలకు కీలకమైన ఖనిజాలు అత్యంత కీలకమన్నారు. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఇమేజింగ్, న్యూక్లియర్ ఎనర్జీ వంటి వివిధ రంగాల్లో.. లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, కాపర్ వంటి క్రిటికల్ మినరల్స్ చాలా అవసరం. భారత్ మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచ భవిష్యత్తు ఈ మినరల్స్పై ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారత్ తన అవసరాలకు 95% క్రిటికల్ మినరల్స్ను దిగుమతి చేసుకుంటుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్ కొన్ని దేశాల్లోనే కేంద్రీకృతమై ఉందన్నారు కేంద్రమంత్రి. కొన్ని దేశాలు ఉద్దేశపూర్వకంగా వీటిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తున్నాయి. దీంతో క్రిటికల్ మినరల్స్ అనేది ఒక కీలకమైన జియోపొలిటికల్ అంశంగా మారిందన్నారు. ఇది భారతదేశానికి కూడా ఒక సవాలుగా మారింది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో క్రిటికల్ మినరల్స్ కొరతను అధిగమిస్తున్నామన్నారు. ప్రపంచ క్రిటికల్ మినరల్ రంగంలో భారతదేశంలో ఓమైనా, ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఎదిగేందుకు ఇదే సరైన సమయం అన్నారు.
ప్రధాని మోదీ విధానాలు, సమగ్ర చర్యలకు సరైన బాటలు వేస్తోందన్నారు. ఈ రంగంలో అందరు భాగస్వామ్య పక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం క్రిటికల్ మినరల్స్ విషయంలో మిషన్ మోడ్లో పనులు మొదలుపెట్టింది. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేది ఈ దిశలో తీసుకున్న కీలకమైన అడుగు అని కేంద్ర మంత్రి తెలిపారు. అన్వేషణ నుండి వెలికితీత, ప్రాసెసింగ్, రిఫైనింగ్, రీసైక్లింగ్, పరిశోధన, విదేశాల్లోని క్రిటికల్ మినరల్ ఆస్తులను దక్కించుకోవడం వరకు మొత్తం సరఫరా గొలుసును బలపరచడమే ప్రస్తుతం భారత్ ముందున్న లక్ష్యమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
దీనికితోడు దేశీయంగా క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిని పెంచడంపైనా దృష్టిసారించామన్నారు. 2014 కి ముందు దేశంలో 1,400 ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టులు మాత్రమే ఉండేవి. ఈరోజు ఆ సంఖ్య 4,000 దాటిందన్నారు. దీనికితోడు ఎక్స్ప్లోరేషన్ ను మరో అడుగుముందుకు తీసుకెళ్లేందుకు.. 41 నోటిఫైడ్ ప్రైవేట్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీలు 100% నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిధుల ద్వారా ప్రోత్సాహాన్ని అందజేస్తుంది. 200కి పైగా ప్రాజెక్టులు ఆర్థికంగా సహకారాన్ని అందించాం. ఎక్స్ప్లోరేషన్ రిస్క్ తగ్గించడానికి అదనపు రాయితీలు కూడా అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. డొమెస్టిక్ ప్రాసెసింగ్, రిఫైనింగ్ కెపాసిటీ పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించామని, భారత్ రా మెటీరియల్ ఎగుమతిదారుగా కాకుండా వాల్యూ క్రియేటర్గా మారాలనేది మోదీ సర్కార్ ఉద్దేశమన్నారు. అందుకే.. 24 క్రిటికల్ మినరల్స్పై ఎగుమతి సుంకం మినహాయింపు ఇచ్చామన్నారు. 2026 – 27 బడ్జెట్లో క్యాపిటల్ గూడ్స్పై కస్టమ్స్ డ్యూటీ కూడా మినహాయింపు ఇచ్చాం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే దిశలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతే కాకుండా.. ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రారే ఎర్త్ కారిడార్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి అవసరమైన రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల కోసం రూ. 7,280 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రారంభించామన్నారు. విద్యుత్ వాహనాలు, రెన్యూవబుల్ ఎనర్జీ, రక్షణ రంగాలకు తోడ్పాటు అందించడం లక్ష్యంగా కార్యక్రమ ప్రణాళిక ఉంటుందన్నారు. క్రిటికల్ మినరల్స్ విషయంలో విదేశాలతో ఒప్పందాలు చేసుకోవడంలో చాలా చురుకుగా ముందుకెళ్తున్నామన్నారు. అర్జెంటీనాలో లిథియం గనిని తీసుకున్నాం. త్వరలో అక్కడ పనులు ప్రారంభించబోతున్నాం. కెనడాతో మాట్లాడుతున్నాం. రెండ్రోజుల క్రితం ఫ్రాన్స్ గనుల శాఖ మంత్రితో సమావేశమై కీలకమైన విషయాలు చర్చించానని కేంద్ర మంత్రి వివరించారు.
క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి, విదేశాల నుంచి సేకరించడంతోపాటు.. దేశీయంగా ఉన్న ఈ-వేస్ట్ రీసైక్లింగ్ కూడా ఉపయోగించుకుంటున్నామన్నారు. అందుకే.. మైన్ టైలింగ్స్, మైన్ వేస్ట్ నుండి క్రిటికల్ మినరల్స్ సేకరించేందుకు విధానపరమైన మద్దతును అందజేస్తామన్నారు. వ్యర్థాలనుంచి సంపద సృష్టి జరగాలనే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి కోసం భారతదేశంలోని 7 ప్రతిష్టాత్మక సంస్థలను ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ దిశగా కృషిచేస్తున్న స్టార్టప్లు, MSMEలు, ల్యాబ్లు కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. AI ఆధారిత పరిష్కారాల అభివృద్ధి కూడా జరుగుతోంది. అంతేకాకుండా.. మొన్నటి జనవరిలో కోకింగ్ కోల్ ను కూడా.. క్రిటికల్ మినరల్స్ జాబితాలో చేర్చామని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
MMDR చట్టం 2025లో చేసిన సవరణలతో విదేశీ ఎక్స్ప్లోరేషన్ , మైనింగ్ ప్రాజెక్టులో చురుకుగా పాల్గొంటోంది. NMET పరిధిని విస్తరించి NMDETగా మార్చి విదేశాల్లో చేపట్టనున్న క్రిటికల్ మినరల్ ప్రాజెక్ట్లు కూడా సంపూర్ణమైన మద్దతును అందిస్తున్నాయి. ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఇప్పటివరకు 612 మినరల్ బ్లాక్లు విజయవంతంగా వేలం వేయడం.. మేం తీసుకొస్తున్న సంస్కరణలకు ఒక ఉదాహరణ మాత్రమే. పర్యావరణ మంత్రిత్వ శాఖతో కలిసి బోర్హోల్ పరిమితిని పెంచడం, క్రిటికల్ మినలర్స్ ప్రాజెక్టులకు పబ్లిక్ హియరింగ్ నుండి మినహాయింపు కల్పించడం, గనుల విస్తరణ సరళీకరించడం, కాంపెన్సేటరీ అటవీ పెంపకం విధానాలను సులభతరం వంటి చర్యలు అనేక చర్యలు తీసుకున్నాం. దీని కారణంగా క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రాలు కూడా అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాయని మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అస్సాం 9 నెలల్లోనే వేలం నిర్వహించడం గ్రీన్ఫీల్డ్ మైన్ బ్లాక్స్లో ఉత్పత్తి ప్రారంభించింది. గుజరాత్ ప్రీ-ఎంబెడెడ్ క్లియరెన్స్తో వేగవంతమైన నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ (NIT) జారీ చేసింది. ఒడిషా 4 నెలల్లో 3 బ్రౌన్ఫీల్డ్ బ్లాక్లలో పనులను ప్రారంభించింది. రాజస్థాన్ ఈ ఒక్క ఏడాదిలోనే.. 26 బ్లాక్స్ ను వేలం వేసింది. ఇది వివిధ ప్రభుత్వ విభాగాల సంపూర్ణ సహకారం, సహకారంతోనే సాధ్యమైందని మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం.. విధానపరమైన మద్దతు అందిస్తోంది, బడ్జెట్ విషయంలో చింతలేదు. వ్యవస్థాపతకమైన ఫ్రేమ్వర్క్ సిద్ధంగా ఉంది. అవసరమైన ప్రోత్సాహకాలు అందుతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఉత్తమ పద్దతులను స్వీకరించి వాటిని అమలు చేయాల్సిన విషయంలో భారత మైనింగ్ పరిశ్రమ ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఎక్స్ప్లోరేషన్లో పెట్టుబడులు పెంచడం, అత్యాధునిక సాంకేతికతతో పరిష్కారాలను కనుగొనడం, ప్రాసెసింగ్-రిఫైనింగ్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయడం వంటిది. వాటిపై పరిశ్రమ దృష్టి సారించాలి. అంతర్జాతీయంగా భారత మైనింగ్ వ్యవస్థ ప్రత్యేతను చాటుకునేందుకు ఇదే సరైన సమయం. ఈ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. రానున్న రోజుల్లో క్రిటికల్ మినరల్ రంగంలో.. భారతదేశం విశ్వసనీయమైన పోటీదారుగా నిలిచేందుకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Key highlights of Hon’ble Union Minister Shri @kishanreddybjp’s address at the 2nd Edition of Indian Critical Minerals Landscape : Foundation for Sustainable Future in New Delhi. pic.twitter.com/MtqNTm6ZIQ
— Office of G. Kishan Reddy (@KishanReddyOfc) February 19, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..