రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ వార్నింగ్.. అవి ఆపి తీరాల్సిందే!

|

Oct 10, 2020 | 1:49 PM

కేంద్ర హోం శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా హెచ్చరించింది. రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సైతం వార్నింగిచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా...

రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ వార్నింగ్.. అవి ఆపి తీరాల్సిందే!
Follow us on

Union Home ministry warned states and UTs: కేంద్ర హోం శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా హెచ్చరించింది. రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సైతం వార్నింగిచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు హోం శాఖ కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. దేశంలో పలు రాష్ట్రాలలో మహిళల మీద అకృత్యాలు, అమానుష సంఘటనలు పెరిగిపోతున్న దరిమిలా తాజా పరిణామాలపై కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

మహిళలపై జరిగే నేరాల దర్యాప్తు వేగవంతంగా జరిగాలని, ఈ దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించే పోలీసు అధికారులపై గట్టి చర్యలు తీసుకోవాలని హోం శాఖ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖల్లో పేర్కొంది. మహిళలపై జరిగే నేరాల దర్యాప్తునకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్.ఓ.పీ)ని ఫాలో అవ్వాలని లేఖల్లో నిర్దేశించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 (సీఆర్పీసీ) సెక్షన్ 154 (1) ప్రకారం మహిళలపై జరిగే నేరాలకు ఎఫ్.ఐ.ఆర్. నమోదు కంపల్సరీ అని తెలిపారు.

మహిళలపై జరిగే నేరాల నియంత్రణలో విఫలమయ్యే పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాలను కోరింది. దానికి కొనసాగింపుగానే తాజాగా కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్‌కు లేఖలు రాసినట్లు సమాచారం. మహిళలపై జరిగే అత్యాచార ఉదంతాల దర్యాప్తులో ఎఫ్.ఐ.ఆర్. నమోదు, సెక్సువల్ అసాల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ ప్రొసీజర్ ప్రకారం సాక్ష్యాల సేకరణ, రెండు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయడం వంటి అత్యంత కీలకాంశాలని లేఖల్లో పేర్కొన్నారు. వీటిని నిర్లక్ష్యం చేసే అధికారులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.