Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. టెలికాం, ఆటోమొబైల్‌ రంగాలకు ఊరట! పీఎల్‌ఐకి ఒకే చెప్పిన మోడీ సర్కార్

|

Sep 15, 2021 | 4:28 PM

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న టెలికాం రంగాలను ఆదుకోవడానికి అనేక నిర్ణయాలు ప్రకటించారు. చిప్‌సెట్ల కొరతతో సతమతం అవుతున్న ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు చెప్పింది.

Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..  టెలికాం, ఆటోమొబైల్‌ రంగాలకు ఊరట! పీఎల్‌ఐకి ఒకే చెప్పిన మోడీ సర్కార్
Union Cabinet
Follow us on

Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న టెలికాం రంగాలను ఆదుకోవడానికి అనేక నిర్ణయాలు ప్రకటించారు. అలాగే, కరోనా కాటుకు తోడు చిప్‌సెట్ల కొరతతో సతమతం అవుతున్న ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు చెప్పింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందిస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో వాహన తయారీ, వాహన విడిభాగాల తయారీ, డ్రోన్ల తయారీ పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందివ్వాలంటూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వాహన రంగంలో ప్రోత్సాహకాల కోసం రూ. 26,058 కోట్లు కేటాయింపు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రొడక‌్షన్‌ లింక్‌డ్‌ ఇన్సెంటీవ్‌ విధానం ద్వారా భారత్‌లోకి ఆధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని కేబినెట్‌ అభిప్రాయపడింది. పీఎల్‌ఐ విధానం వల్ల కొత్తగా రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఆస్కారం ఉందని కేంద్రం పేర్కొంది. అంతేకాదు అదనపు ఉత్పత్తి విలువ రూ. 2.3 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.

టెలికాం రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది కేంద్రం. అంతేకాదు టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. ఏజీఆర్‌ బకాయిలు, స్పెక్ట్రమ్‌ చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చెల్లించాల్సిన స్పెక్ట్రమ్‌ వాయిదాలపై ఏడాది మారటోరియం ప్రకటించారు. కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో టెలికాం కంపెనీలకు ముఖ్యంగా వొడాఫోన్‌ ఐడియా కంపెనీకి పెద్ద ఊరట లభించింది. .వొడాఫోన్‌ ఐడియా కంపెనీ సుమారు రూ.50వేల కోట్లకు పైగా కేంద్రానికి ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. తీవ్ర నష్టాల కారణంగా ఆ కంపెనీ మాజీ ఛైర్మన్‌ కుమారం మంగళం బిర్లా తన వాటాను కేంద్రానికి ఇచ్చేస్తానంటూ కేబినెట్‌ సెక్రటరీకి లేఖ రాయడం సంచలనం రేపింది. దీంతో టెలికాం రంగానికి ఊరట కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో స్టాక్‌ మార్కెట్‌లో టెలికాం షేర్లు దూసుకెళ్లాయి.

కేబినెట్‌ సమావేశంలో వాహన తయారీ, వాహన విడిభాగాల తయారీ, డ్రోన్ల తయారీ పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందివ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. వాహన రంగంలో ప్రోత్సాహకాల కోసం రూ. 26,058 కోట్లు కేటాయించారు. డ్రోన్ల తయారీ రంగానికి ప్రోత్సహకాలు అందించేందుకు 120 కోట్లు కేటాయించారు. చైనాకు పోటీగా మాన్యుఫ్యాక్చరింగ్‌ సెక్టార్‌ను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల తయారీకి ప్రోత్సాహం ఇవ్వాలని కూడా కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే, డ్రోన్ల తయారీలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ద్వారా రానున్న మూడేళ్లలో రూ. 5,000 కోట్లు పెట్టబడులు రావడంతో పాటు రూ. 1,500 కోట్ల మేర అదనపు ఉత్పత్తి జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ సెక్టార్‌కి ప్రోత్సహకాలు అందించేందుకు రూ. 120 కోట్ల కేటాయింపులు చేస్తు్న్నట్లు మంత్రి వెల్లడించారు.

Read Also…  సైదాబాద్ రాక్షకుడిని పట్టుకునేందుకు మరిన్ని క్లూస్.. గుండు చేయించుకుంటే ఇలా ఉంటాడు..