Thief Apology Letter: ‘క్షమించండి! తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేస్తున్నా.. నెలలో తిరిగిచ్చేస్తా’ దొంగ గారి లేఖ

|

Jul 04, 2024 | 5:08 PM

ఎవరూలేని సమయం చూసి ఈ ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు. దొరికిన కాడికి దోచేసి.. వెళ్తూ వెళ్తూ ఓ లెటర్‌ అక్కడ పెట్టేసి వెళ్లిపోయాడు. తాను దొంగ కాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే వారి ఇంట్లో దొంగతనం చేస్తున్నానని, దోచుకున్న సొమ్మునంతా నెలరోజుల్లోనే తిరిగిచ్చేస్తానంటూ సదరు లేఖలో దొంగ రాసి పెట్టాడు. తీరా ఇంటికి వచ్చిన యజమానులు ఇంటిలో సొమ్ము పోయిందని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు..

Thief Apology Letter: క్షమించండి! తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేస్తున్నా.. నెలలో తిరిగిచ్చేస్తా దొంగ గారి లేఖ
Thief Apology Letter
Follow us on

చెన్నై, జులై 4: ఎవరూలేని సమయం చూసి ఈ ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు. దొరికిన కాడికి దోచేసి.. వెళ్తూ వెళ్తూ ఓ లెటర్‌ అక్కడ పెట్టేసి వెళ్లిపోయాడు. తాను దొంగ కాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే వారి ఇంట్లో దొంగతనం చేస్తున్నానని, దోచుకున్న సొమ్మునంతా నెలరోజుల్లోనే తిరిగిచ్చేస్తానంటూ సదరు లేఖలో దొంగ రాసి పెట్టాడు. తీరా ఇంటికి వచ్చిన యజమానులు ఇంటిలో సొమ్ము పోయిందని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు. క్లూ కోసం వారి ఇంట్లో సోదా చేయగా ఈ లెటర్ వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడులోని మేఘ్నాపురం శాంతనకుళం రోడ్డులో నివాసం ఉంటోన్న రిటైర్డ్ టీచర్ దంపతులు చిత్తిరై సెల్విన్‌, ఆయన భార్య నివాసం ఉంటున్నారు. వీరు ఉపాధ్యాయులుగా పనిచేసి ఈ మధ్యనే రిటైర్డ్‌ అయ్యారు. వీరికి ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహం కావడంతో వారంతా తలోచోట వేరు వేరు ఊళ్లలో నివాసం ఉంటున్నారు. వీరి కొడుకు సెల్విన్ చెన్నైలో ఉండటంతో జూన్‌ 17న భార్యాభర్తలిద్దరూ చెన్నైలోని కుమారుడిని చూసేందుకు వెళ్లారు. 9 రోజుల తర్వాత అంటే జూన్ 26న వీరు తిరిగి తమ ఇంటికి చేరుకున్నారు. ఊరెళ్లిన సమయంలో ఇంటిని చూసుకునేందుకు సెల్వి అనే మహిళను కాపలాగా ఉంచారు. దీంతో సోమవారం సాయంత్రం సెల్వి ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లగా ఆ ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించింది.. వెంటనే యజమానులకు ఫోన్‌ చేసి విషయం తెలిపింది. దీంతో చెన్నై నుంచి వచ్చిన చిత్తిరై సెల్వన్‌ ఇంట్లోని బీరువా చూడగా.. అందులో ఉన్న రూ.60 వేల నగదు, బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించాడు.

చేసేదిలేక స్థానిక పోలీసులకు చిత్తిరై సెల్వన్‌ ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూ కోసం ఇల్లంతా పరిశీలించగా.. వారికి ఓ లెటర్‌ దొరికింది. అది దొంగతనం చేసిన దొంగ రాసిన ఉత్తరంగా పోలీసులు గుర్తించారు. అందులో.. ‘నన్ను క్షమించండి. మా ఇంట్లో ఒకరికి ఆనారోగ్యంగా ఉన్నందున దొంగతనం చేయాల్సి వచ్చింది. నెలలో వీటిని తిరిగి ఇచ్చేస్తాను. అందుకే దొంగతనం చేశానని’ రాసి పెట్టాడు. సదరు లేఖను చూసిన పోలీసులు, ఇంటి యజమాని అవాక్కయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇంటికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. గత ఏడాది కేరళలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి మెడలో బంగారు నెక్లెస్ దొంగిలించిన ఓ దొంగ.. ఆ గొలుసు విక్రయించగా వచ్చిన నగదుతో పాటు క్షమాపణ లేఖతో తిరిగి బాలిక ఇంటి వద్ద వదిలి వెళ్లాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.