
NPS: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్లో(NPS) ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం వెలువడింది. రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్లో పెన్షన్ ఉపసంహరణ నిబంధనలను సడలించింది. ఈ మేరకు డిసెంబర్ 16వ తేదీన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ప్రకటన విడుదల చేసింది. ఈ సవరణల ప్రకారం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఎన్పీఎస్ అకౌంట్లో రూ.8 లక్షలు ఉంటే ఒకేసారి ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
గతంలో ఎన్పీఎస్ ఉద్యోగులు తమ కార్పస్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా పరిమితులు ఉండేవి. ఇప్పుడు రూ.8 లక్షల వరకు ఉంటే ఒకేసారి మొత్తం తీసుకోవచ్చు. ఇక రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు కార్పస్ ఫండ్ ఉంటే.. రూ.6 లక్షల వరకు ఉపసంహరించుకోవచ్చు. ఇక రూ.12 లక్షలకు మించి ఉంటే ప్రస్తుతం అమల్లో ఉన్న 60:40 నియమం వర్తిస్తుంది. అంటే 60 శాతం వరకు ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు.
ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పీఎస్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి నిబంధనలు మారలేదు. సాధారణంగా ఎగ్జిట్ అవ్వడానికి ఎన్పీఎస్ చందాదారులు 60 సంవత్సరాల వయస్సు వరకు లేదా పదవీ విరమణ లేదా పదవీ విరమణ వయస్సు, ఏది వర్తిస్తుందో అంతవరకు పెట్టుబడి పెట్టడం కొనసాగించాల్సి ఉంటుదని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ నిబంధనల్లో పొందుపర్చింది.