
తమిళనాడు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో సూట్కేస్లో శరీర భాగాలు దొరికిన కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాకు చెందిన ఒక మహిళను చెన్నైలో కిరాతకంగా చంపి, శరీర భాగాలను సూట్కేస్లో పెట్టి రైలులో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘోరం ఆగస్టు 5న జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా రైల్వే స్టేషన్కు చేరుకున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ బోగీలో ఉన్న ఒక ఎరుపు రంగు సూట్కేస్ నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దాన్ని తెరిచి చూడగా నరికిన మానవ శరీర భాగాలు కనిపించాయి. ఆ సూట్కేస్ను చెన్నై సెంట్రల్ స్టేషన్లోనే రైలు ఎక్కించినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. కేసు ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగి చెన్నై సెంట్రల్ స్టేషన్ చుట్టుపక్కల దాదాపు 350 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఒక మహిళ, ఒక పురుషుడు కలిసి ఎరుపు రంగు సూట్కేస్తో స్టేషన్లోకి వచ్చి రైలులో పెట్టినట్లు రికార్డయింది. ఆ తర్వాత వారు చెన్నై పార్క్ స్టేషన్ నుంచి లోకల్ రైలు ఎక్కి గూడువాంచేరికి వెళ్లినట్లు గుర్తించారు.
గూడువాంచేరి పరిసరాల్లోని సీసీటీవీల ఆధారంగా వారు ఎక్కిన ఆటోను పోలీసులు కనిపెట్టారు. ఆ ఆటో వెళ్లిన మార్గాన్ని బట్టి మసీదు వీధిలోని వారి అద్దె ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మరకలు, హత్య జరిగినట్లు బలమైన ఆధారాలు దొరికాయి. హత్య తర్వాత ఆనవాళ్లు లేకుండా చేసేందుకు నిందితులు చేసిన పనులు పోలీసులనే షాక్ అయ్యేలా చేశాయి. మృతదేహాన్ని ముక్కలుగా కోసి, ఎముకలను వేరు చేసి కొన్ని భాగాలను సూట్కేస్లో కుక్కారు. మిగిలిన శరీర భాగాలను మైదా పిండి, కూరగాయలతో కలిపి పెద్ద బిర్యానీ పాత్రలో పెట్టి ఉడికించినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి తల కోసం గాలింపు కొనసాగుతుంది.
మృతురాలిని ఒడిశాకు చెందిన హయత్ నిషాగా గుర్తించారు. ఆమె భర్తతో విడిపోయింది. ఆమె తాంబరంలోని ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తుండగా, ఆమె కుమారుడు ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అయితే నిషా మాణిక్ ఉత్తిన్ – లస్కర్ దంపతులతో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. మాణిక్ ఉత్తిన్ తనకు తమ్ముడు అవుతాడని నిషా చుట్టుపక్కల వారికి చెప్పినట్లు సమాచారం. భార్యభర్తలు ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు, నగల కోసమే ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.