
అది ముంబై సమీపంలోని థానే జిల్లా. స్థానికంగా ఉన్న సముద్రతీరంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి వాకింగ్ చేస్తున్నాడు. ఇంతలో అతడికి ఓ పెద్ద బ్యాగ్ కనిపించింది. ఆశగా వెళ్లి అందులో ఏముందోనని ఓపెన్ చేసి చూడగా.. కనిపించిన దృశ్యాన్ని చూసి దెబ్బకు దడుసుకున్నాడు. ఆ బ్యాగ్లో అతడికి తల లేని మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారాన్ని అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మహిళ మొండాన్ని రెండు భాగాలుగా చేసి బ్యాగ్లో పెట్టినట్లు గుర్తించారు. ఆ మృతదేహం ఓ చెయ్యిపై త్రిశూలం టాటూ, మరో చేతితో ఓం అని రాసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. మృతురాలు ఎవరన్న దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.