Delhi Riots 2020: ఢిల్లీ హింసను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన హోం మంత్రి అమిత్ షాను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తన విధుల నిర్వహణలో ఆయన వైఫల్యం చెందారని, నగరంలో అల్లర్లు, ఘర్షణలను నివారించడంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం కూడా మౌన ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని ఈ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దుయ్యబట్టారు. తమ పార్టీ ప్రతినిధిబృందంతో కలిసి ఆమె గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ తరుణంలో మీ అధికారాలను ఉపయోగించి ‘రాజధర్మాన్ని’ కాపాడాలని కోరుతూ ఆయనకు ఓ మెమోరాండం సమర్పించినట్టు ఆ తరువాత సోనియా తెలిపారు. ఇంత జరుగుతున్నా.. బీజేపీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మౌన ప్రేక్షకులుగా వ్యవహరిస్తున్నాయని ఆమె విమర్శించారు. ఈ హింసాకాండ దేశానికే సిగ్గు చేటని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఇలా ఉండగా గత ఆదివారం నగరంలో ప్రారంభమైన అల్లర్లు, ఘర్షణలు నాలుగురోజులుగా కొనసాగుతున్నాయి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ.. పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదు. ఈ ఘర్షణల్లో మృతి చెందినవారి సంఖ్య 34 కి పెరగగా, 200 మందికి పైగా గాయపడ్డారు. 130 మందిని అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.