
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ చీలిక ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీ నేతృత్వంలో ఒక తిరుగుబాటు వర్గం అవతరించింది.
రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరిన వేళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ బోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రీతబ్రత బెనర్జీతో పాటు 58 మంది తిరుగుబాటు నాయకుల నియామకానికి స్పీకర్ ఆమోదం తెలిపారు. అంతేకాకుండా, రీతబ్రత బెనర్జీని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అధికారికంగా గుర్తించారు. అంతకుముందు రీతబ్రత బెనర్జీ నేతృత్వంలో 60 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి, 58 మంది సంతకాలు చేసిన మద్దతు లేఖలను సమర్పించారు. తామే అసలైన టీఎంసీ వర్గమని, మెజారిటీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని వారు వాదించారు.
తిరుగుబాటు వర్గం అసెంబ్లీలో తమ కొత్త నాయకత్వ బృందాన్ని కూడా ప్రతిపాదించింది. శాసనసభ పక్ష నాయకుడుగా రీతబ్రత బెనర్జీ, ఉప నాయకులుగా జావేద్ ఖాన్, సందీపన్ సాహా,యు షియులి సాహా, పార్టీ చీఫ్ విప్గా రఘునాథ్గంజ్ ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ పేర్లను ప్రతిపాదించారు. ఈ మేరకు ఒక లేఖను శాసనసభ స్పీకర రవీంద్రనాథ్ బోస్కు అందజేశారు.
గత మంగళవారం (జూన్ 2, 2026) సెంట్రల్ కోల్కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాలేదు. అదే సమయంలో, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా భావించే శోభన్దేబ్ చటోపాధ్యాయ్, నయన బంద్యోపాధ్యాయ్, మదన్ మిత్రా, కునాల్ ఘోష్ వంటి సీనియర్ నేతలు బుధవారం (జూన్ 3, 2026) అసెంబ్లీలో జరిగిన తిరుగుబాటు వర్గం సమావేశానికి దూరంగా ఉన్నారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక పార్టీ చీలిపోయినప్పుడు అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే శాసనసభ పక్షంలో కనీసం మూడింట రెండు వంతుల (2/3) మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్కు మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, చట్టపరంగా రక్షణ పొందడానికి కనీసం 54 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే రీతబ్రత బెనర్జీ వర్గానికి 58 మందికి పైగా ఎమ్మెల్యేల స్పష్టమైన మద్దతు ఉండటంతో మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..