Prashant Kishor: మళ్లీ కేంద్రంలో అధికారం బీజేపీదే.. అలా అయితే తప్పా: ప్రశాంత్ కిశోర్

Prashant Kishor: వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే విజయమని ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు.

Prashant Kishor: మళ్లీ కేంద్రంలో అధికారం బీజేపీదే.. అలా అయితే తప్పా: ప్రశాంత్ కిశోర్
Prashant Kishor

Updated on: Mar 21, 2023 | 12:05 PM

వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే విజయమని ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. బీహార్‌ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జన సూరజ్ యాత్రలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని విపక్షాలన్ని ఏకమైన బీజేపీని ఏమీ చేయలేవని సుస్పష్టం చేశారు.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల పెద్దగా ప్రయోజనం ఏమి లేదన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికలకు దేశ వ్యాప్తంగా అన్ని పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌ను గద్దె దించేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ప్రతిపక్ష పార్టీలు ఏకమైనా వాటి మధ్య సిద్ధాంతపరమైన తేడాలు ఉంటాయని.. వాటి ఐక్యత కూడా స్థిరంగా ఉండదని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. విపక్షాలు బీజేపీని ఓడించాలంటే ముందుగా హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇది త్రీ లెవెల్ పిల్లర్ అని అన్నారు. వీటిలో కనీసం రెండింటిని విపక్షాలు అధిగమించపోతే… బీజేపీని కనీసం ఎన్నికల్లో ఎదురుకునే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు ఉదాహణగా తెలిపారు. ఈ క్రమంలోనే త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయని ఆయన గుర్తు చేశారు.

హిందుత్వ సిద్ధాంతంపై పోరాడాలంటే ప్రతిపక్ష పార్టీలన్నీ తమ సిద్ధాంతాలను పక్కనబెట్టి ఏకం కావల్సిన అవసరముందన్నారు. ఎవరి సిద్ధాతం వారిది అనుకుంటే మాత్రం బీజేపీని ఓడించడం కష్టమని పీకే అన్నారు. గాంధీవాది, అంబేద్కర్ రైట్స్, సోషలిస్టులు, కమ్యూనిస్టులు… ఏదైనాసరే సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమని… అయితే ఈ సిద్ధాంతాల వల్లే ప్రజల నమ్మకాన్ని సాధించడం అంత ఈజీ కాదన్నారు. తనది మహాత్మాగాంధీ భావజాలమని.. బీహార్ లో తాను చేపట్టిన జన సూరజ్ యాత్ర లక్ష్యం కూడా గాంధీ కాంగ్రెస్ ను మళ్లీ తీసుకురావడానికి చేసే ప్రయత్నమేనని ప్రశాంత్ కిశోర్ అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us