ఇండో-పసిఫిక్‌లో భారత్ వ్యూహాత్మక అడుగు.. మూడు దేశాల పర్యటనకు మోదీ శ్రీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటనకు సోమవారం (జూలై 06) శ్రీకారం చుట్టారు. జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ వ్యూహాత్మక ఉనికిని మరింత విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికత, విద్య, ఆర్థిక భాగస్వామ్యం, ప్రవాస భారతీయులతో అనుబంధం వంటి కీలక అంశాలు ఈ పర్యటనలో ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి.

ఇండో-పసిఫిక్‌లో భారత్ వ్యూహాత్మక అడుగు.. మూడు దేశాల పర్యటనకు మోదీ శ్రీకారం
Pm Modi Indo Pacific Relations

Updated on: Jul 06, 2026 | 11:16 AM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటనకు సోమవారం (జూలై 06) శ్రీకారం చుట్టారు. జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ వ్యూహాత్మక ఉనికిని మరింత విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికత, విద్య, ఆర్థిక భాగస్వామ్యం, ప్రవాస భారతీయులతో అనుబంధం వంటి కీలక అంశాలు ఈ పర్యటనలో ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి.

పర్యటన తొలి దశలో ప్రధాని మోదీ ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు జూలై 6 నుంచి 8 వరకు జకార్తా, యోగ్యకార్తాలలో పర్యటిస్తారు. 2018లో భారత్–ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ చేస్తున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం. ఇటీవల భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రబోవో హాజరుకావడంతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక విశ్వాసం మరింత బలపడింది. ఈ పర్యటనలో రక్షణ సహకారం, సముద్ర భద్రత, వాణిజ్య విస్తరణ, పెట్టుబడుల ప్రోత్సాహం, ప్రాంతీయ భద్రతా అంశాలపై ఇరు దేశాల నాయకులు విస్తృతంగా చర్చించనున్నారు.

యోగ్యకార్తాలోని ప్రపంచ ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయాన్ని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవో కలిసి సందర్శించనున్నారు. భారతదేశం–ఇండోనేషియా మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరిక సంబంధాలకు ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తోంది. అలాగే అక్కడ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై కూడా దృష్టి సారించనున్నారు.

ఇండోనేషియా పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌కు చేరుకుని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో సమావేశమవుతారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఇరు నాయకులు చర్చించనున్నారు. రక్షణ, భద్రత, సముద్ర సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, కీలక సాంకేతికతలు, క్రీడలు, క్రీడా విజ్ఞానం వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ఇండో-పసిఫిక్ వ్యూహంలో భారత్–ఆస్ట్రేలియా కీలక భాగస్వాములుగా ఎదిగిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. మెల్బోర్న్‌లో నిర్వహించే భారీ భారతీయ సమాజ కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.

పర్యటనలో చివరగా ప్రధాని మోదీ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు వెళ్లి ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు, వాణిజ్య విస్తరణ, పెట్టుబడులు, వ్యవసాయం, సాంకేతికత, ఆర్థిక సహకారం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆక్లాండ్‌లో నిర్వహించే భారీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

పర్యటనకు ముందు విడుదల చేసిన సందేశంలో ప్రధాని మోదీ, ఇండోనేషియాతో భారతదేశానికి శతాబ్దాల నాటి సాంస్కృతిక అనుబంధం ఉందని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో భాగస్వామ్యం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని పేర్కొన్నారు. ఈ పర్యటన మూడు దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే భారతదేశం అమలు చేస్తున్న “యాక్ట్ ఈస్ట్” విధానం, “మహాసాగర్” విజన్, స్వేచ్ఛాయుత, సమ్మిళిత, నియమాధారిత ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణానికి భారతదేశ నిబద్ధతను ఈ పర్యటన మరోసారి ప్రపంచానికి చాటుతుందని చెప్పారు.

దౌత్యపరంగా ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉందని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. ఇండోనేషియాతో వ్యూహాత్మక సంబంధాలు, ఆస్ట్రేలియాతో రక్షణ–సాంకేతిక భాగస్వామ్యం, న్యూజిలాండ్‌తో ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించడమే కాకుండా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బాధ్యతాయుత శక్తిగా భారతదేశ పాత్రను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా ఈ పర్యటన నిలవనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us