
రాజకీయాల్లోనే కాదు.. డిజిటల్ ప్రపంచంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభంజనం సృష్టిస్తున్నారు. ప్రపంచ దేశాధినేతలందరినీ వెనక్కి నెట్టి సోషల్ మీడియా సామ్రాజ్యానికి కింగ్గా అవతరించారు. యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు.. ఎక్స్ నుంచి ఫేస్బుక్ వరకు.. ప్రతి చోటా మోదీ మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు 3 కోట్లు సబ్స్క్రైబర్ల మార్కును దాటి, ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన నాయకుడిగా రికార్డు సృష్టించింది. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (6.6 మిలియన్లు) కంటే మోదీ నాలుగు రెట్లు ముందున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే మోదీ సబ్స్క్రైబర్ల సంఖ్య ఏడు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. మన దేశంలో చూస్తే రాహుల్ గాంధీ కంటే మూడు రెట్లు, అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల సంయుక్త సబ్స్క్రైబర్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆధిపత్యాన్ని మోదీ ప్రదర్శిస్తున్నారు. ఫిబ్రవరి 26న ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్న మొదటి రాజకీయ నాయకుడిగా మోదీ చరిత్రకెక్కారు. ఆయన ఫాలోయింగ్ ఎంతలా ఉందంటే.. ప్రపంచంలోని తదుపరి ఐదుగురు అగ్రనేతల ఫాలోవర్లను కలిపినా మోదీ దరిదాపుల్లోకి రాలేరు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండో స్థానంలో ఉండగా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఆయన వెనకే ఉన్నారు.
2014లో ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు మోదీ అనుసరిస్తున్న డిజిటల్ అవుట్రీచ్ వ్యూహం యువతను అమితంగా ఆకట్టుకుంటోంది. దేశవిదేశాల్లోని యువతతో ఆయన నిరంతరం కనెక్ట్ అవ్వడమే ఈ భారీ ఫాలోయింగ్కు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.